– రిజర్వేషన్ల పెంపునకు నాలుగేళ్లు
మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు
నవతెలంగాణ – అశ్వారావుపేట
గిరిజనుల రిజర్వేషన్ల పెంపు, పోడు భూములకు పట్టాల పంపిణీ, తండాలు–గూడేలకు పంచాయతీ హోదా కల్పించడం వంటి నిర్ణయాలతో గిరిజనుల హక్కులకు బీఆర్ఎస్ ప్రభుత్వం భరోసా కల్పించిందని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా కేసీఆర్కు అశ్వారావుపేట నియోజకవర్గ గిరిజనుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
గిరిజన జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగాల్లో అవకాశాలు మెరుగుపర్చాలనే ఉద్దేశంతో కేసీఆర్ తీసుకున్న నిర్ణయం గిరిజన బిడ్డలకు ఎంతో ప్రయోజనం చేకూర్చిందని మెచ్చా పేర్కొన్నారు. తండాలు, గూడేలను గ్రామ పంచాయతీలుగా మార్చాలన్న గిరిజనుల దశాబ్దాల పోరాటాలను గుర్తించి, స్వరాష్ట్రంలో వాటికి పంచాయతీ హోదా కల్పించిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు.
బీఆర్ఎస్ హయాంలో అశ్వారావుపేట నియోజకవర్గంలో 26 వేల ఎకరాలకు పోడు పట్టాలు అందించడంతో పాటు, ఆ భూములకు రైతుబంధు వర్తింపజేసి గిరిజన రైతులను ఆదుకున్నారని గుర్తుచేశారు. గిరి వికాస్ పథకం కింద బోర్లు వేయించడం, అర్హులకు పింఛన్లు అందించడం వంటి చర్యలు చేపట్టారని తెలిపారు.
గిరిజనుల కోసం మూడు కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ హామీని అమలు చేయకుండా మోసం చేసిందని మెచ్చా విమర్శించారు. ప్రతిపక్షంగా ప్రజా సమస్యలను ప్రస్తావిస్తుంటే గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి కేసీఆర్పై భూముల పేరుతో తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ప్రజా సమస్యలపై దృష్టి సారించి, గిరిజనులకు ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే అమలు చేయాలని మెచ్చా నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.



