– తహశీల్దార్ తో సమావేశం అయిన మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్
– గడువు లోపు డిజిటైజేషన్ ప్రత్యేక కార్యాచరణకు సన్నాహాలు
నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికల ఈఎఫ్ (ఎన్యుమరేషన్ ఫారం)ల డిజిటైజేషన్ ప్రక్రియ ఇంకా పూర్తిస్థాయిలో ముగియలేదు. శుక్రవారం (25-07-2026) రాత్రి 10 గంటల నాటికి విడుదలైన గణాంకాల ప్రకారం మొత్తం 17,151 మంది ఓటర్లలో 13,914 మంది (81.13 శాతం) వివరాలు మాత్రమే డిజిటైజ్ అయ్యాయి. ఇంకా 3,237 మంది (18.87 శాతం) వివరాలు నమోదు కావాల్సి ఉంది. ఈ వివరాలు అధికారుల రోజువారీ ప్రగతి నివేదికలో వెల్లడయ్యాయి. దీంతో శనివారం తహశీల్దార్ దాసరి కిశోర్ కుమార్ తో మున్సిపల్ వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు సమావేశం అయ్యారు.
డిజిటైజేషన్ లో పార్ట్ నంబర్–161 (బీఎల్ఓ వి. మురళీకృష్ణ) అత్యుత్తమంగా 96.13 శాతం పూర్తి చేసి మొదటి స్థానంలో నిలిచారు. తరువాత పార్ట్–157 (ఎ. నాగేంద్రరావు) 94.97 శాతం, పార్ట్–155 (టి. రాజేశ్వరి) 93.61 శాతం, పార్ట్–169 (ఎన్. ఉషా దేవి) 92.65 శాతం నమోదు చేశారు. మరోవైపు కొన్ని పోలింగ్ భాగాల్లో పురోగతి ఆందోళన కలిగిస్తోంది.పార్ట్–163 (ఎస్.కే. రాజియా)లో కేవలం 70.42 శాతం, పార్ట్–162 (టి. భాగ్య లత) లో 71.78 శాతం,పార్ట్–166 (అరేపోగు మౌనిక) లో 71.43 శాతం,పార్ట్–158 (నాగమణి సూరనేని) లో 72.87 శాతం,పార్ట్–159 (నల్లబోతుల ఇంద్ర) లో 73.08 శాతం మాత్రమే డిజిటైజేషన్ పూర్తయింది.
అత్యధికంగా పార్ట్–163లో 357 మంది, పార్ట్–166లో 332 మంది, పార్ట్–159లో 323 మంది, పార్ట్–158లో 315 మంది, పార్ట్–162లో 298 మంది ఓటర్ల వివరాలు ఇంకా డిజిటైజ్ కావాల్సి ఉంది. మొత్తంగా చూస్తే మున్సిపాలిటీలో పనులు ఆశించిన స్థాయిలో పురోగమిస్తున్నప్పటికీ, మిగిలిన 3,237 మంది ఓటర్ల వివరాల డిజిటైజేషన్ను వేగవంతం చేసి లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేయాల్సిన అవసరం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఈ క్రమంలో వైస్ ఛైర్పర్సన్ జూపల్లి రమేష్ బాబు బూత్ ల వారీ ప్రత్యేక ఎన్యుమరేషన్ ఫారాలు స్వీకరణ కోసం కసరత్తు చేపట్టారు.ఇందుకోసం మైక్ ప్రచారం నిర్వహించే మున్సిపాలిటీ కార్యాలయం ప్రాంగణంలో నే బూత్ లు వారీగా ఫారాలు స్వీకరించడం,ఓటరు వివరాలు పూర్తి చేయడం,డిజిటైజేషన్ చేయించే విధంగా చర్యలు కు ఉపక్రమించారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల విభాగం డిప్యూటీ తహశీల్దార్ హుస్సేన్, కాంగ్రెస్ సోషల్ మీడియా జిల్లా బాధ్యులు చీకటి శ్రీనివాస్ రావు,మండల అధ్యక్షుడు చిన్నం శెట్టి సత్యనారాయణ, కౌన్సిలర్ మిండ హరిక్రిష్ణ లు పాల్గొన్నారు.



