జులై 24 వరకు ఇంటింటి సర్వే
అక్టోబర్ 1న తుది ఓటరు జాబితా ప్రచురణ
ఎన్యుమరేషన్ ఫాం నింపకుంటే
ఓటు హక్కు కోల్పోతారు
ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల సంఘం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో గురువారం నుంచి ఓటర్ల ప్రత్యేక సవరణ (సర్) ప్రారంభం కానుంది. జూన్ 25 నుంచి జులై 24 వరకు నెల రోజుల పాటు ఇంటింటి సర్వే నిర్వహిస్తారు. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) అన్ని ఏర్పాట్లు చేసింది. 33 మంది జిల్లా ఎన్నికల అధికారులు, 119 మంది ఓటర్ రిజిస్ట్రేషన్ అధికారులు, 882 మంది ఏఈఆర్ఓలు, 35,935 బూత్ స్థాయి అధికారులు (బీఎల్వో), 3,596 సూపర్వౌజర్లు, 49,018 ఏజెంట్లను నియమించింది. పని విభజనపై ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది.
బీఎల్వో ప్రతి ఇంటిని సందర్శించి రెండు ప్రతుల ఓటరు నమోదు ఫారాలను అందజేస్తారు. బీఎల్వో ఇంటిని సందర్శించినప్పుడు ఇల్లు తాళం వేసి ఉంటే, కనీసం మూడు సార్లు సందర్శిస్తారు. ఓటర్లు తమ నమోదు ఫారాలను ఆన్లైన్లో కూడా డౌన్లోడ్ చేసుకుని పూర్తి చేసి, సమర్పించవచ్చు. ఓటర్ల పేరు లేదా వారి తల్లిదండ్రులు, తాత లేదా అమ్మమ్మ పేర్లు 2002 ప్రత్యేక సమగ్ర సవరణ ఓటరు జాబితాలో ఉంటే.. వాటి వివరాలను కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. నిర్దిష్ట సమయంలో నమోదు ఫారాలను సమర్పించలేని ఓటర్లు, క్లెయిమ్ లు, అభ్యంతరాల కాలంలో నిర్దేశిత ప్రకటన ఫారంతో పాటు ఫారమ్-6 సమర్పించి పేరు నమోదు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు సమర్పించని ఓటర్ల విషయంలో ఈఆర్వో, ఏఈఆర్వోలు విచారణ ప్రారంభి స్తారు. విచారణ సమయం లో అవసరమైన పత్రాలను సమర్పిం చాల్సి ఉంటుంది. ఫారం 8 ద్వారా నియోజకవర్గం లోపల లేదా బయట నివాస మార్పు, వివరాల సవరణ చేసుకోవచ్చు. క్లెయిమ్ లు, అభ్యంతరాల పరిష్కారం అనంతరం తుది ఓటరు జాబితాను అక్టోబర్1న ప్రచురిస్తారు. ఎన్యుమరేషన్ ఫారం నింపని వారు తమ ఓటును కోల్పోతారని ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అర్హులైన ప్రతి వ్యక్తి ఫారం నింపి స్థానిక బీఎల్ఓకు అందజేయాల్సి ఉంటుంది.
రాష్ట్రంలో సర్ షెడ్యూల్….
ఇంటింటి గణన……. జూన్ 25 నుంచి జులై 24 వరకు
ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ ………… జులై 31
అభ్యంతరాల దాఖలు ……. జులై 31 నుంచి ఆగస్టు 08 వరకు
అభ్యంతరాల పరిష్కారం……… జులై 31 నుంచి ఆగస్టు 28 వరకు
తుది ఓటరు జాబితా ప్రచురణ………………. అక్టోబర్ 1
పోలింగ్ స్టేషన్ల వివరాలు..
అసెంబ్లీ నియోజకవర్గాలు …. 119
పోలింగ్ స్టేషన్లు ….. 19,942
అర్బన్ ….. 14,750
రూరల్ ….. 21,157
మొత్తం జనాభా (2011) 3,50,03,674
పురుషులు ….. 1,176,11,633
మహిళలు ….. 1,173,92,041
సర్ సిబ్బంది వివరాలు…
జిల్లా ఎన్నికల అధికారులు …… 33
ఓటర్ రిజిస్ట్రేషన్ అధికారులు ……. 119
అదనపు ఓటర్ రిజిస్ట్రేషన్ అధికారులు ….. 882
బూత్ స్థాయి సూపర్వైజర్లు ….. 3,596
బూత్ స్థాయి అధికారులు …. 35,985
బూత్ స్థాయి ఏజెంట్లు …. 49,018
సర్పై నిర్లక్ష్యం వహిస్తే సహించం
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)పై నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ముఖ్యమంత్రి ఎనుములు రేవంత్రెడ్డి కాంగ్రెస్ నేతలను హెచ్చరించారు. దానిపై మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్చార్జీలతో టీపీసీసీ అద్యక్షులు మహేశ్కుమార్ గౌడ్ అధ్యక్షతన బుధవారం నిర్వహించిన జూం మీటింగ్లో పాల్గొన్న సీఎం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కొందరు నాయకులు సర్ పైన నిర్లక్ష్యంగా ఉంటున్నారనీ, పార్టీకి నష్టం జరుగుతుంటే చూస్తూ ఊర్కొమని స్పష్టం చేశారు. పార్టీ ఆదేశాలను పట్టించుకోని గుర్తించి వారి స్థానంలో మరొక ఇన్చార్జిని నియమిస్తామని అన్నారు. పార్టీ నుంచి సర్ పైన రాష్ట్ర వ్యాప్తంగా మరిన్ని అవగాహన సదస్సులు జరగాలని సూచించారు. జిల్లా ఇన్చార్జి మంత్రులు చొరవ తీసుకోవాలన్నారు. సర్ విషయంలో సరిగా వ్యవహారించకపోతే పేద ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదల ఓట్లు పోతే ఆధార్ కార్డ్, రేషన్ కార్డు పోతుందనీ,. వాళ్లకు అన్యాయం జరగనివ్వొద్దని అన్నారు. గ్రామాల్లో సర్పంచ్లతో సర్ పైన ప్రచారం చేయించి అవగాహన కల్పించాలని సూచించారు. ఏఐసీసీ ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ సర్ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు చురుగ్గా పాల్గొనాలని కోరారు.
గ్రామాల్లో ఎన్నికల సమయంలో ఎలా ప్రచారం చేస్తామో సర్ విషయంలోనూ అలాగే చేయాలన్నారు. ఓటు హక్కు కోల్పోకుండా ప్రతి ఒక్కరికి వారి హక్కు కాపాడాడేందు కాంగ్రెస్ శ్రేణులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, తదితరులు పాల్గొన్నారు.
నేటి నుంచి సర్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



