విద్యకు 20 శాతం నిధులు కేటాయించాలి
ముషీరాబాద్ పాఠశాలలో
మౌలిక సదుపాయాలు కల్పించండి:
సీఎం రేవంత్రెడ్డికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్ జిల్లాలోని ముషీరాబాద్ ప్రభుత్వోన్నత పాఠశాలలో కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలనీ, ఖాళీగా టీచర్ల పోస్టులను భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాల కుదింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. విద్యకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకోవాలని విన్నవించారు. బుధవారం ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. ‘రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతంచేసి పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన ఉచిత విద్యను అందించాలనే లక్ష్యంతో ఈ లేఖను రాస్తున్నాను. సీపీఐ(ఎం) హైదరాబాద్ నగర కమిటీ ఆధ్వర్యంలో జూన్ 19న ముషీరాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను సందర్శించాను. విద్యార్థులతో పాటు, ఉపాధ్యాయులతో చర్చించిన తర్వాత వారు ఎదుర్కొంటున్న కొన్ని ముఖ్యమైన సమస్యలను మీ దృష్టికి తెస్తున్నాను. విద్యా శాఖను కూడా తమరే చూస్తున్నందున తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నాను. స్కూల్లో 800లకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. గదులు సరిపోకపోవడంతో 2021లో ప్రారంభించిన అదనపు భవన నిర్మాణానికి రూ.4.5 కోట్లు కేటాయించినప్పటికీ నిధుల విడుదల చేయకపోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి.
దీంతో తరగతి గదుల కొరత ఏర్పడి, పాఠశాల రెండు షిఫ్టుల్లో నడుస్తున్నది. ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం వరకు ప్రైమరీ స్కూలు, మధ్యాహ్నం తర్వాత హైస్కూలు నడుపుతున్నారు. దీనివల్ల విద్యార్థుల విద్యా సమయం తగ్గుతోంది. సరిపడా తరగతి గదులు లేక విద్యార్థులు ఇరుకైన గదుల్లో ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే భవన నిర్మాణ నిధులు విడుదల చేయాలి. విద్యార్థుల సంఖ్యకు తగ్గట్టుగా వాష్రూమ్లు లేవు. చాలా వాష్రూమ్స్ల్లో నీటి సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు బకెట్లతో నీటిని తీసుకెళ్తున్నారు. కొన్ని మరుగుదొడ్లకు డ్రెయినేజీ సౌకర్యంలేదు. వర్షపు నీరు పాఠశాల ఆవరణలో నిలవడంతో చిన్నపిల్లలు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో పాటు పాఠశాల ప్రాంగణంలోకి బయటి వాహనాలను పార్కు చేయడంతో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయి. వీటిని పరిష్కరించాలి’ అని లేఖలో కోరారు.
‘ముషీరాబాద్ పాఠశాలలో ఇంగ్లీష్, ఉర్దూ, బయాలజీ, పీఈటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. తక్షణమే వాటిని భర్తీ చేయాలి. కంప్యూటర్ ల్యాబ్లో 12 కంప్యూటర్లలో తొమ్మిది మాత్రమే పని చేస్తున్నాయి. కంప్యూటర్ టీచర్ లేకపోవడం వల్ల విద్యార్థులు డిజిటల్ విద్యకు దూరమవుతున్నారు. ఇప్పటివరకు విద్యార్థులకు యూనిఫాంలు అందలేదు. మధ్యాహ్న భోజన నిర్వహణ నాణ్యత అధ్వాన్నంగా ఉంది. నాణ్యమైన ఆహారం అందక, విద్యార్థులు ఇంటి నుంచి భోజనం తెచ్చుకుంటున్నారు’ అని లేఖలో ఎత్తిచూపారు.
ప్రభుత్వ బడుల కుదింపు నిర్ణయాన్నివెనక్కి తీసుకోండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



