నవతెలంగాణ-హైదరాబాద్ : మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టడం వెనుక కేంద్ర ప్రభుత్వానికి రాజకీయ ప్రయోజనాలే తప్ప చిత్తశుద్ధి లేదని కాంగ్రెస్ లోక్సభ ఉపనేత గౌరవ్ గొగోయ్ ఘాటుగా విమర్శించారు. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్సభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొని, ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. మహిళలకు నిజంగా అధికారం కట్టబెట్టాలనే ఆలోచన ఉంటే, ఎటువంటి నిబంధనలు లేకుండా వెంటనే ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
గతంలో యూపీఏ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ల కోసం చిత్తశుద్ధితో ప్రయత్నించిందని, కానీ ఇప్పుడు కేంద్రం సాకులు వెతుకుతూ కాలయాపన చేస్తోందని గొగోయ్ మండిపడ్డారు. జనగణన, నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే రిజర్వేషన్లు అమలులోకి వస్తాయనే మెలిక పెట్టడం ద్వారా మహిళలకు తక్షణమే దక్కాల్సిన హక్కులను ప్రభుత్వం అడ్డుకుంటోందని ఆరోపించారు. ఈ తరహా నిబంధనలు సామాజిక న్యాయానికి విరుద్ధమని, ఇది కేవలం గందరగోళం సృష్టించే ప్రయత్నమేనని ఆయన వ్యాఖ్యానించారు.
మహిళా బిల్లులో ఓబీసీ మహిళలకు ప్రత్యేక వాటా కల్పించకపోవడాన్ని గౌరవ్ గొగోయ్ తీవ్రంగా తప్పుబట్టారు. రిజర్వేషన్లలో అన్ని వర్గాల మహిళలకు ప్రాతినిధ్యం ఉన్నప్పుడే అది సమగ్రమైన బిల్లు అనిపించుకుంటుందని స్పష్టం చేశారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపట్టడం ద్వారా కొన్ని రాష్ట్రాల రాజకీయ ప్రాధాన్యతను తగ్గించే కుట్ర జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రానికి నారీ శక్తిపై నిజమైన గౌరవం ఉంటే, ఎటువంటి షరతులు లేకుండా రిజర్వేషన్లు అమలు చేయాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. దీనిపై విపక్షాల తరపున పార్లమెంట్లో తమ పోరాటం కొనసాగుతుందని గొగోయ్ తేల్చి చెప్పారు.



