నవతెలంగాణ – ఉప్పునుంతల
మండలంలోని యువత ఆన్లైన్ బెట్టింగులు, గంజాయి వంటి మత్తు పదార్థాల వినియోగం, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని ఉప్పునుంతల తహసిల్దార్ అద్దంకి సునీత హెచ్చరించారు. ఇటీవల మండల కేంద్రంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ, ఇటువంటి వ్యసనాలు వ్యక్తుల జీవితాలతో పాటు కుటుంబాలను కూడా తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయని అన్నారు.
సోమవారం నవతెలంగాణతో ప్రత్యేకంగా మాట్లాడుతూ.. బెట్టింగులు, గంజాయి విక్రయాలు, వినియోగం వంటి సామాజిక రుగ్మతలను అరికట్టడమే తమ ప్రధాన లక్ష్యమని తెలిపారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడే వారిపై పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్-1867, ఇతర సంబంధిత చట్టాల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. యువత తమ భవిష్యత్తుపై దృష్టి సారించి, విద్య, ఉపాధి, క్రీడలు వంటి సానుకూల రంగాల్లో ముందుకు సాగాలని సూచించారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు, యువత సహకరించాలని ఆమె కోరారు.
“వ్యసనాలకు దూరంగా ఉంటేనే కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు” అని తహసిల్దార్ హెచ్చరించారు.



