నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వం నిరుపేదల సొంతింటి కలను సాకారం చేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. సోమవారం కాటారం మండలం దన్వాడ గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మంత్రి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఇందిరమ్మ ఇళ్లను మరియు గ్రామ పంచాయతీ భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు నూతన వస్త్రాలను పంపిణీ చేసి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం రూ.20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ భవనం నిర్మాణం ద్వారా గ్రామ ప్రజలకు పరిపాలన సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ఎలాంటి లోటు ఉండదని మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాహుల్ శర్మ,అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ పిడి లోకిలాల్ ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.



