Tuesday, June 2, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలు​ఎట్లా కొనరో చూస్తాం

​ఎట్లా కొనరో చూస్తాం

- Advertisement -

సేకరించిన వడ్లు, జొన్నలు కొనకుంటే
జూన్‌ 15 తర్వాత బీజేపీ సంగతి తేలుస్తాం
బీజేపీ కార్మాలయం, నేతల ఇండ్లముందే ధాన్యం బస్తాలు పోస్తాం :
కాగజ్‌నగర్‌ సభలో హెచ్చరించిన సీఎం రేవంత్‌రెడ్డి

నవతెలంగాణ- కాగజ్‌నగర్‌
’75 లక్షల క్వింటాళ్ల వరిధాన్యాన్ని మా ప్రభుత్వం సేకరించింది. ఈ ధాన్యాన్ని కొనడానికి కేంద్రం ముందుకు రావడం లేదు. కనీస మద్దతు ధర ప్రకటించిన కేంద్రం వడ్లు, మక్కలు కొనడం లేదు.. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం సేకరించిన వడ్లు, తడిసిన ధాన్యం, మక్కలు కేంద్ర ప్రభుత్వం కొనాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఇందుకు కేంద్ర మంత్రిగా కిషన్‌ రెడ్డి బాధ్యత తీసుకోవాలి. కిషన్‌ రెడ్డి ఆ బాధ్యత తీసుకోకుంటే జూన్‌ 15న ఆ ధాన్యం తీసుకొచ్చి బీజేపీ కార్యాలయం వద్ద లేదా మీ ఇండ్ల ముందు పోస్తాం. జూన్‌ 15 తరువాత ఎట్లా కొనరో మీ సంగతి తేలుస్తాం. కేంద్రం ధాన్యం కొనాలంటే కిషన్‌రెడ్డి బాధ్యత తీసుకోవాలి. అలా బాధ్యత తీసుకోకుంటే కిషన్‌రెడ్డి తెలంగాణలో తిరగడం కష్టమవుతుంది. జూన్‌ 15 తర్వాత కార్యాచరణ ఉంటుంది. ఇందుకు రైతులంతా మద్దతుగా నిలవాలని కోరుతున్నా.. రైతులెవ్వరూ అధైర్యపడొద్దు.. ఎన్ని క్వింటాళ్ల ధాన్యం ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం కొంటుంది తడిసిన ప్రతి గింజనూ ప్రభుత్వం కొంటుంది’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి భరోసా ఇచ్చారు. కాగజ్‌నగర్‌ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కాళేశ్వరం కట్టడం అది కూలేశ్వరం కావడం జరిగిపోయింది కానీ ఆదిలాబాద్‌కు జిల్లాకు ఎకరాకూ నీళ్లు రాలేదు. అందుకే తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు నిర్మించి రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు అందించాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశాను.. కానీ ఆయన స్పందించడం లేదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా.. అంతర్రాష్ట్ర జలవివాదాలను ఆయా రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని ఒక పక్క ప్రధాని మోడీ చెపుతుండగా, అందుకు విరుద్ధంగా తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది.

ఏడాదికాలంగా మాట్లాడే ప్రయత్నం చేసినా ఫలితం ఉండటం లేదు. ఆదిలాబాద్‌ జిల్లా ఉప్పెనై కదులుతుంది. రైతులు ఉప్పెనై కదిలితే మహారాష్ట్రకు ఇబ్బందులు తప్పవు. మా బాధను, అవసరాన్ని మీరు అర్థం చేసుకోవాలి. తుమ్మిడిహెట్టి పూర్తయితే గ్రావిటీతో లక్షలాది ఎకరాలకు నీరు అందించొచ్చు. కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిపై గురుతర బాధ్యత ఉంది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకో నిర్లక్ష్యం చేస్తున్నారు లక్షలాది మంది రైతుల పక్షాన కిషన్‌ రెడ్డి దూతగా వ్యవహరించాలి. నాకు ఎలాంటి భేషజాలూ లేవు. అవసరమైతే మీ ఇంటికి రావడానికి కూడా నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడించి రైతులకు నీళ్లు ఇవ్వడానికి సహకరించండి పోలవరం కోసం ఏడు మండలాలను ఇచ్చిన మోడీ ప్రభుత్వం తెలంగాణ కోసం మహారాష్ట్ర నుంచి రెండువేల ఎకరాలు ఇప్పించలేరా? అసలు కిషన్‌ రెడ్డి ఆలోచనేంటో ముందు బయటపెట్టండి. రైతు ప్రయోజనాల కోసం మోడీ అయినా.. కిషన్‌ రెడ్డి అయినా ఎవరినీ లెక్కచేయను ఐ డోంట్‌ కేర్‌ ఎనీ వన్‌.. నాకు రైతుల ప్రయోజనమే ముఖ్యం. తుమ్మిడిహెట్టి వద్ద ప్రాజెక్టు కట్టి తీరుతాం’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -