జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
నవతెలంగాణ – వనపర్తి
జనగణన ప్రక్రియలో పాల్గొనే ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు వారికి ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకొని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా జనగణన ప్రక్రియ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శనివారం మర్రికుంటలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రారంభమైన ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ జనగణన లో పాల్గొనబోయే ఎన్యుమరేటర్లకు పలు కీలక సూచనలు చేశారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. జనగణన ప్రక్రియలో పాల్గొనే ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు వారికి ఇస్తున్న శిక్షణను సద్వినియోగం చేసుకొని, ఎలాంటి తప్పులు లేకుండా జనగణన ప్రక్రియ నిర్వహించాలని ఆదేశించారు. ఎన్యుమరేటర్లు క్షేత్రస్థాయికి వెళ్లే ముందు తమకు అందజేసిన హౌస్ లిస్టింగ్ బ్లాక్ మ్యాప్ ఆధారంగా హద్దులను ముందస్తుగా తనిఖీ చేసుకోవాలని సూచించారు. ఎవరి పరిధిలో వారే జన గణన ప్రక్రియ నిర్వహించాలని సూచించారు.
ఒక కిచెన్ ఆధారంగా ఒక హౌస్ హోల్డ్ ని నిర్ణయించాలని ఎన్యుమరేటర్లకు సూచించారు. జనగణనకు వెళ్ళినప్పుడు ప్రజలు సమాచారం ఇవ్వడంలో ఇబ్బందులకు గురి చేస్తే, వారి యొక్క వ్యక్తిగత సమాచారం ఎక్కడ వినియోగించడం జరగదని కేవలం జన గణన కోసం మాత్రమే తీసుకోవడం జరుగుతుందని వారికి తెలియజేయాలన్నారు. ఓకే ఇంటికి ఇద్దరు ఎన్యూమరేటర్లు వెళ్లి డబల్ ఎన్యుమరేషన్ ఎట్టి పరిస్థితుల్లో జరగడానికి వీల్లేదని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపిఓ హరికృష్ణ, మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, తహసిల్దార్ రమేష్ రెడ్డి, ట్రైనర్లు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.



