నవతెలంగాణ – ఉప్పునుంతల
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండలం కొరటికల్ గ్రామానికి చెందిన విద్యావంతుడు, జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమకారుడు బోదనపెల్లి వేణుగోపాల్ రెడ్డిని అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ (ఈసీ) సభ్యుడిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
యూనివర్సిటీ కౌన్సిల్ సభ్యులుగా నలుగురిని నియమించగా, ప్రభుత్వం పక్షాన వేణుగోపాల్ రెడ్డికి అవకాశం కల్పించడం విశేషం. ప్రస్తుతం టి-సాట్ సీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆయనకు ఎడ్యుకేషన్ యూనివర్సిటీ కౌన్సిల్ మెంబర్గా నియామకం రావడం గౌరవప్రదంగా భావిస్తున్నారు.
మారుమూల గ్రామమైన కొరటికల్లో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన వేణుగోపాల్ రెడ్డి విద్యార్థి దశ నుంచే ఉద్యమాల్లో చురుకుగా పాల్గొన్నారు. అనంతరం జర్నలిస్టుగా, జర్నలిస్టు ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తూ అంచెలంచెలుగా ఎదిగారు.
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా పాలనలో భాగస్వామ్యమవుతూ చురుకుగా పనిచేస్తున్న ఆయన తన నియామకానికి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
వేణుగోపాల్ రెడ్డి ఈసీ సభ్యుడిగా ఎంపిక కావడం పట్ల కొరటికల్ గ్రామం, ఉప్పునుంతల మండలం, అచ్చంపేట నియోజకవర్గం, నాగర్ కర్నూల్ జిల్లా సహా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని పలువురు హర్షం వ్యక్తం చేశారు.



