Sunday, April 19, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఆర్ఠిక చేయూత‌నిస్తున్న మ‌హిళా పారిశ్రామిక వేత్త‌లు

ఆర్ఠిక చేయూత‌నిస్తున్న మ‌హిళా పారిశ్రామిక వేత్త‌లు

- Advertisement -

ఏదో ఒక వ్యాపారం చేస్తూ ఆర్థికంగా బలపడుతున్న మహిళలు మన చుట్టూ ఎందరో ఉంటారు. అయితే తాము మాత్రమే ఎదిగితే సరిపోదు, తమతో పాటు మరో పదిమంది… అందునా తోటి మహిళలు కూడా ఎదిగేందుకు తోడ్పాటునందించాలని భావించేవారు చాలా అరుదుగా ఉంటారు. కానీ వీళ్లు మాత్రం వెనుకబడిన మహిళలకు ఆర్ధిక చేయూత అందించడం తమ లక్ష్యంగా పెట్టుకున్నారు. వారికి అవసరమైన రుణాలు అందేలా చూస్తున్నారు. అలాగే వారి ఉత్పత్తులను మార్కెట్‌కు అనుసంధానం చేస్తున్నారు. ఈ విధంగా మహిళలకు ఆదాయ మార్గాలను అందిస్తూ బలమైన భారత్‌ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న నలుగు మహిళా పారిశ్రామిక వేత్తల గురించి నేటి మానవిలో తెలుసుకుందాం…

అజైతా షా – ఫ్రాంటియర్‌ మార్కెట్స్‌
అజైతా షా తన వ్యవస్థాపక ప్రయాణాన్ని 2011లో ఫ్రాంటియర్‌ మార్కెట్స్‌తో ప్రారంభించారు. ఇది దీర్ఘకాలిక ప్రయోజనాలపై దృష్టి సారించిన ఒక సోషల్‌ టెక్‌ కామర్స్‌ సంస్థ. ఈ ప్లాట్‌ఫారమ్‌ సరళ్‌ జీవన్‌ సహేలీలు అనే గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలచే నడపబడే సహాయక-వాణిజ్య నమూనాతో ఉత్పత్తులు, సేవలను నేరుగా గ్రామ గృహాలకు అందిస్తుంది. న్యూయార్క్‌లో పుట్టి పెరిగిన షా, గ్రామీణ భారతదేశంపై దృష్టి సారించడానికి ముందు టఫ్ట్స్‌ విశ్వవిద్యాలయంలోని ఫ్లెచర్‌ స్కూల్‌లో అంతర్జాతీయ సంబంధాలు అభ్యసించారు. 35,000 మందికి పైగా గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు ఫ్రాంటియర్‌ మార్కెట్స్‌ వారి ‘మేరీ సహేలి’ యాప్‌ను డిజిటల్‌ స్టోర్‌ఫ్రంట్‌లుగా ఉపయోగిస్తున్నారు. వీరికి ఫైనాన్స్‌, ఇంధనం, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, వినియోగ వస్తువుల వంటి నిత్యావసర సేవలను అందిస్తున్నారు. ఈ మహిళా పారిశ్రామికవేత్తలు సమిష్టిగా 5,000 గ్రామాలలో 4 మిలియన్లకు పైగా వినియోగదారులకు సేవలు అందిస్తూ, గ్రామీణ వాణిజ్యం ద్వారా 100 మిలియన్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించారు. మాస్టర్‌కార్డ్‌ సెంటర్‌ ఫర్‌ ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌, అక్యుమెన్‌ ఫండ్‌, టీజీపీ రైజ్‌ వంటి ప్రపంచ భాగస్వాముల మద్దతుతో, ఈ సంస్థ 2030 నాటికి 10 లక్షల మంది గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించడానికి కృషి చేస్తోంది. దీని ద్వారా కోట్లాది మంది వినియోగదారులను చేరుకునే అవకాశం ఉంది.

నీతూ యాదవ్‌, కీర్తి జాంగ్రా – యానిమల్ల్‌
భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఒక ముఖ్యమైన చోదకశక్తి పాడి పరిశ్రమ. అయితే చాలా వరకు ఇది విచ్ఛిన్నంగా, అసంఘటితంగా మిగిలిపోయింది. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకొచ్చేందుకు నీతూ యాదవ్‌, కీర్తి జాంగ్రా కలిసి ఓ కొత్త ప్రయోగం చేశారు. అదే యానిమల్ల్‌. అనధికారిక నెట్‌వర్క్‌లు, మధ్యవర్తులపై ఆధారపడిన రంగాన్ని అధికారికం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వాస్తవానికి ఇది మొదట ఒక హ్యాకథాన్‌ ప్రాజెక్ట్‌గా ప్రారంభమైంది. ఆ తర్వాత, వ్యవస్థాపకులు 2019లో బెంగళూరులోని ఒకే గది నుండి దీనిని వారాంతపు ప్రాజెక్ట్‌గా కొనసాగించారు. నీతూ, జాంగ్రాల సారథ్యంలో యానిమల్ల్‌ సంస్థ తొలిసారి స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల కోసం రూపొందించారు. ఇందులోని సరళమైన, స్థానిక భాషకు ప్రాధాన్యతనిచ్చే ఇంటర్‌ఫేస్‌ ద్వారా రైతులు ఆన్‌లైన్‌లో పశువులను కొనడానికి, అమ్మడానికి సహకరిస్తుంది. నేడు యానిమల్ల్‌ అనేక రాష్ట్రాల్లోని రైతులకు చేరువయ్యింది. వారి లావాదేవీలను సులభతరం చేస్తూ, ప్రక్రియలను సరళీకరిస్తూ ఈ వ్యవస్థపై నమ్మకాన్ని పెంచుతోంది. పశువుల వ్యాపారంతో పాటు యానిమల్ల్‌ మొత్తం పాడి పరిశ్రమను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది భీమా, ఫైనాన్సింగ్‌, పశువుల గ్రేడింగ్‌ వంటి సేవలను అందిస్తూ, మరింత నిష్పక్షపాతమైన లావాదేవీలను నిర్ధారిస్తూ, రైతులు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.

మంజరి శర్మ – ఫార్మ్‌ దీదీ
బీహార్‌లో ఒక ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నప్పుడు మంజరి శర్మకు స్వయం సహాయక బృందాలలోని మహిళల నుండి పదేపదే ఒక ప్రశ్న ఎదురైంది: ”దీదీ, హమ్‌ ఔర్‌ క్యా కర్‌ సక్తే హై?” (అక్కా.. మేము ఇంకేం చేయగలం?) ఆ మహిళలు అప్పటికే వ్యవసాయం, ఇంటి పనులు చేస్తున్నప్పటికీ వారి ఆర్థిక భాగస్వామ్యం పరిమితంగానే ఉంది. ఈ అంతర్దృష్టి చివరికి మంజరిని 2021లో ఫార్మ్‌ దీదీని స్థాపించేలా చేసింది. మంజరి మార్కెట్‌ అనుసంధానం, వ్యాపార సామర్థ్యంపై దృష్టి పెడుతుంది. ఈ రంగాలలో మహిళలకు మద్దతు కొరవడింది. అందుకే వారికి అవగాహన కల్పించడం మొదలుపెట్టింది. సాంప్రదాయ ఆహార ఉత్పత్తులను తయారు చేయడానికి స్వయం సహాయక బృందాలలోని మహిళలతో కలిసి పనిచేస్తుంది. ఫార్మ్‌ దీదీ బ్రాండింగ్‌, ప్యాకేజింగ్‌, పంపిణీని కూడా నిర్వహిస్తుంది. ఈ స్టార్టప్‌ తర్వాత కాలంలో గృహ ఆధారిత నైపుణ్యాలను సమర్థవంతంగా లాభదాయకమైన సంస్థలుగా మార్చింది. ఈ స్టార్టప్‌ 45కు పైగా గ్రామాలలో 1,800 మందికి పైగా మహిళలతో కలిసి పనిచేస్తుంది. స్థానిక ప్రజలలో ఎంతో మార్పును తీసుకొచ్చింది. ఆదాయానికి మించి, నైపుణ్య నిర్మాణం, శిక్షణ, ఆత్మవిశ్వాసంపై దృష్టి సారించింది. తద్వారా మహిళలు నాణ్యత, ప్యాకేజింగ్‌, వ్యాపార ప్రక్రియలను నిర్వహించగలుగుతారు. 10 లక్షల గ్రామీణ మహిళలకు సాధికారత కల్పించాలనే స్పష్టమైన లక్ష్యంతో మంజరి ముందుకు వెళుతుంది.

నిధి పంత్‌ – ఎస్‌4ఎస్‌ టెక్నాలజీస్‌
నిధి పంత్‌కు వ్యవసాయ మార్కెట్లలోని ఆసక్తికరమైన పరిశీలనల నుండి ఎస్‌4ఎస్‌ టెక్నాలజీస్‌ వెనుక ఉన్న ఆలోచన ఉద్భవించింది. రైతులు తాజా ఉత్పత్తులను మండీలకు తీసుకువచ్చినా, అమ్ముడుపోని సరుకు పాడైపోవడాన్ని ఆమె గమనించారు. ఈ వృధా వారి ఆదాయాలను తీవ్రంగా దెబ్బతీసి, చిన్న రైతులను నష్టభయం వైపు నెట్టింది. అసలైన లోపం ఉత్పత్తిలో కాకుండా, పంట కోతానంతర మౌలిక సదుపాయాలలో ఉందని నిధి గుర్తించారు. అందుకే రైతులు తాము పండించిన పంట విలువను నిలుపుకోవడంలో సహాయపడే ఒక పరిష్కారాన్ని రూపొందించడానికి ఆమె పూనుకున్నారు. ఇదే ఎస్‌4ఎస్‌ టెక్నాలజీస్‌ ఆవిర్భావానికి దారితీసింది. ఎస్‌4ఎస్‌ టెక్నాలజీస్‌ ‘పొలాల్లోనే కర్మాగారాలు’ అనే వికేంద్రీకృత నమూనాను అందిస్తుంది. దీనిలో భాగంగా సౌరశక్తితో పనిచేసే డీహైడ్రేషన్‌ యూనిట్లు, రైతులు (వారిలో చాలామంది మహిళలు) తమ మిగులు ఉత్పత్తులను ఎక్కువ కాలం నిల్వ ఉండే పదార్థాలుగా మార్చుకోవడానికి వీలు కల్పిస్తాయి. ఇది పునరుత్పాదక శక్తిని, స్థానిక ప్రాసెసింగ్‌, మార్కెట్‌ అనుసంధానాన్ని మిళితం చేస్తుంది. స్థాపించినప్పటి నుండి ఈ సంస్థ వందలాది మంది మహిళా పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇచ్చింది. వేలాది మంది రైతులతో కలిసి పనిచేసింది. తద్వారా వృధాగా పోయే పంటల నుండి వారు అదనపు ఆదాయాన్ని సంపాదించుకునేలా చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -