పదవీ కాలం ముగిసిన చైర్మెన్తో సమీక్ష సమావేశం ఏర్పాటు
డ్యూటీ రూల్స్ ఉల్లంఘించిన సోనిబాలా దేవి
నవతెలంగాణ-హైదరాబాద్
తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ (శాట్)లో ప్రభుత్వ ఆదేశాల అతిక్రమణ, డ్యూటీ రూల్స్ ఉల్లంఘన, విధుల పట్ల నిర్లక్ష్యంతో వైస్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ సోనిబాలా దేవి వివాదానికి కేంద్ర బిందువుగా మారారు. పదవీ కాలం ముగిసిన శాట్ చైర్మన్తో సమీక్ష సమావేశం నిర్వహించిన వీసీ,ఎండీ డ్యూటీ నెగ్లిజెన్స్కు పాల్పడ్డారు. నామినేటెడ్ పదవి శాట్ చైర్మెన్ పదవీ కాలం ముగిసిన తర్వాత సహజంగానే అధికారాలు రద్దు అవుతాయి. అధికార దుర్వినియోగం కాకుండా చూడటం వైస్ చైర్మెన్, మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యత. కానీ, స్వయంగా వీసీ-ఎండీ.. డిప్యూటీ డైరెక్టర్లు, కోచ్లు, క్రీడాకారుల తల్లిదండ్రులతో మాజీ చైర్మెన్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించటం వివాదానికి దారితీసింది.
ముగిసిన పదవీ కాలం :తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మర్మెన్గా శివసేనా రెడ్డి రెండేండ్ల కాలానికి నియమితులయ్యారు. 2024 జులై 13న పదవీ బాధ్యతలు స్వీకరించగా, ఈ ఏడాది జులై 13న ఆయన పదవీ కాలం ముగిసింది. శివసేనా రెడ్డికి పొడగింపు వస్తుందనే వార్తలు వినిపిస్తున్నా.. ఎక్కడా ఎటువంటి అధికారిక ఉత్తర్వులు వెలువడలేదు. ఇటీవల ఖేలో ఇండియా యూత్ గేమ్స్ షెడ్యూల్ ప్రతిపాదనలతో కేంద్ర క్రీడా శాఖమంత్రి మన్సుఖ్ మాండవీయను కలిసినప్పుడు క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి కార్యాలయం నుంచి వచ్చిన ప్రెస్ రిలీజ్లో శివసేనా రెడ్డిని మాజీ స్పోర్ట్స్ చైర్మెన్గా పేర్కొనటం గమనార్హం.
వీసీ-ఎండీ నిబంధనల ఉల్లంఘన
తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ చట్టం ప్రకారం ప్రభుత్వ నిబంధనలను, ఆదేశాలను అమలు చేయాల్సిన పూర్తి బాధ్యత మేనేజింగ్ డైరెక్టర్దే. పదవీ కాలం ముగిసిన చైర్మన్ను అధికారిక సమావేశాలకు అనుమతించటం, ప్రోటోకాల్ కల్పించటం ప్రభుత్వ రూల్స్కు విరుద్ధం. అఖిల భారత సర్వీస్ రూల్స్ ప్రకారం దీన్ని డ్యూటీ నెగ్లిజెన్స్గా పరిగణిస్తారు. ఇవన్నీ తెలిసీ, వీసీ-ఎండీ సోనిబాలా దేవి మాజీ చైర్మెన్తో సమీక్ష సమావేశం నిర్వహించటం చర్చనీయాంశంగా మారింది.
వివాదం ఎక్కడొచ్చిందంటే
శాట్ స్టేడియాల్లో కోచింగ్ ఫీజులు, క్రీడా పోటీలకు స్టేడియాల అద్దెను భారీగా పెంచుతూ క్రీడాశాఖ నిర్ణయం తీసుకోవటం తీవ్ర విమర్శలకు దారితీసింది. క్రీడాకారులు, క్రీడాకారుల తల్లిదండ్రులు ఎల్బీ స్టేడియం ఆవరణలో ర్యాలీగా నిరసన వ్యక్తం చేశారు. క్రీడా సంఘాలు సైతం ఈ నిర్ణయాన్ని తప్పుపట్టాయి. దీంతో నష్ట నివారణ చర్యలో భాగంగా క్రీడాకారుల తల్లిదండ్రులు, కోచ్లు, స్టేడియం అడ్మినిస్ట్రేటర్స్, డిప్యూటీ డైరెక్టర్ సహా వీసీ-ఎండీతో మాజీ చైర్మెన్ శివసేనా రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫీజులపై అధ్యయనానికి సబ్ కమిటీ వేసేందుకు సమీక్ష సమావేశంలో చైర్మెన్గా శివసేనా రెడ్డి నిర్ణయం తీసుకున్నారని శాట్ పీఆర్వో నుంచి ప్రెస్ రిలీజ్ సైతం వచ్చింది. దీంతో పదవీ కాలం ముగిసిన చైర్మెన్ సమీక్ష సమావేశం నిర్వహించటం, ఆ సమావేశంలో వీసీ-ఎండీ సహా డిప్యూటీ డైరెక్టర్లు, స్టేడియం అడ్మినిస్ర్టేటర్లు, కోచ్లు పాల్గొనటం వివాదానికి దారితీసింది. ఈ అంశంపై వీసీ ఎండీ సోనిబాలా దేవిని వివరణ అడుగగా ‘చైర్మెన్కు పొడగింపు వచ్చింది, లేనిది నాకు తెలియదు. మంత్రి వాకిటి శ్రీహరితో మాట్లాడి చెబుతాను’ అని తెలిపింది.
మంగళవారం ఎల్బీ స్టేడియంలో చైర్మెన్ చాంబర్లో సమీక్ష సమావేశం నిర్వహిస్తున్న మాజీ చైర్మెన్ శివసేనా రెడ్డి, పక్కన వీసీ ఎండీ సోనిబాలా దేవి
ఉద్యోగులు రిటైర్ అయ్యాక నిమిషం ఆలస్యం చేయకుండా పంపిస్తారు. రాజకీయ నాయకులకు, నామినేటెడ్ పదవులకు ఆ రూల్ వర్తించదా?. పదవీ కాలం ముగిసిన తర్వాత చైర్మెన్గా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనటం, సమీక్ష సమావేశాలు నిర్వహించటం ఎంత వరకు సమంజసం. అధికార దుర్వినియోగం కాకుండా జాగ్రత్త వహించాల్సిన వీసీ-ఏండీ స్వయంగా మాజీ చైర్మెన్తో సమీక్ష సమావేశానికి ఏర్పాట్లు చేయటం దేనికి సంకేతం?



