గడ్డం వెంకటేష్ డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి
నవతెలంగాణ – ఆలేరు రూరల్
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గడ్డం వెంకటేష్ విమర్శించారు. శనివారం ఆలేరు పట్టణ కేంద్రంలో డీవైఎఫ్ఐ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా రంగారెడ్డి జిల్లా కేంద్రంగా నిర్వహించిన బహిరంగ సభలో “యూత్ డిక్లరేషన్” పేరుతో రాజీవ్ యువ వికాస్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచినా ఇప్పటివరకు ఆ హామీలను నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. పథకంలో దరఖాస్తు చేసుకున్న ప్రతి నిరుద్యోగ యువకుడికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
యూత్ డిక్లరేషన్లో పేర్కొన్న ఐదు అంశాలను అమలు చేస్తామని,ఏడాది లోపే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క హామీని కూడా అమలు చేయలేదని వెంకటేష్ అన్నారు.రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగ యువత ఉద్యోగాలు, ఉపాధి లేక గ్రామాల్లో అమాలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, ప్రభుత్వ ప్రోత్సాహం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేసి రాజీవ్ యువ వికాస్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని,లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా నిరుద్యోగ యువతను సమీకరించి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వడ్డెమాను విప్లవ్,మొరిగాడి పృథ్వి,కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.



