- Advertisement -
- ఎల్నినో పరిస్థితుల దృష్ట్యా ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన
- నవతెలంగాణ – అశ్వారావుపేట
- అశ్వారావుపేట మండలంలో సోమవారం వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు పి. రవికుమార్, మండల వ్యవసాయ అధికారి పి. శ్రీనివాసరావు పలు గ్రామాల్లో ప్రత్తి పంటలను సందర్శించి పరిశీలించారు. పంట ఎదుగుదల, తెగుళ్లు, పురుగుల ఉధృతి, నివారణ చర్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు తగిన సాంకేతిక సూచనలు అందించారు.
- అనంతరం అశ్వారావుపేట రైతు వేదికలో ప్రస్తుత ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో రైతులకు ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పిస్తూ విత్తన మేళాను నిర్వహించారు.
ఈ సందర్భంగా అపరాల పంటలు, మినుములు, పెసర, కంది, వివిధ రకాల కూరగాయల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున తక్కువ నీటితో సాగు చేయగల ప్రత్యామ్నాయ పంటలను ఎంచుకోవాలని అధికారులు రైతులకు సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ప్రణాళిక రూపొందించుకోవడం ద్వారా నష్టాలను తగ్గించుకోవచ్చని వివరించారు.
మండలంలోని రైతులు విత్తన మేళాను సద్వినియోగం చేసుకుని అవసరమైన నాణ్యమైన విత్తనాలను పొందాలని వ్యవసాయ శాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) సతీష్, భాను, రవీంద్ర, విత్తన డీలర్లు, రైతులు పాల్గొన్నారు.
- Advertisement -


