2,000 మందికి ఉద్యోగావకాశాలు
నవతెలంగాణ – హైదరాబాద్
ప్రముఖ అంతర్జాతీయ ఫైనాన్షియల్ సేవల సంస్థ ‘చార్లెస్ స్క్వాబ్’ కొత్తగా హైదరాబాద్లో 3.45 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తన కొత్త టెక్నాలజీ కెపబిలిటీ సెంటర్ ‘స్క్వాబ్ ఇండియా’ను ఏర్పాటు చేసింది. దీనిని బుధవారం తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు లాంచనంగా ప్రారంభించారు. ప్రపంచంలోనే టాప్ 10 బ్రోకరేజ్, ట్రేడింగ్ సంస్థల్లో 9 సంస్థలకు హైదరాబాద్ హబ్గా ఉందనడానికి చార్లెస్ స్క్వాబ్ రాక మరో నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. కాగా, హైదరాబాద్ సరైన మౌలిక సదుపాయాలు, అత్యుత్తమ టెక్నాలజీ ప్రతిభకు నిలయమని స్క్వాబ్ ఇండియా ఎండి ప్రదీప్ మీనన్ తెలిపగా, 4.8 కోట్ల మంది ఖాతాదారులకు సేవలు అందించే తమ సామర్థ్యాన్ని ఈ కేంద్రం మరింత బలోపేతం చేస్తుందని సంస్థ చీఫ్ కార్పొరేట్ అఫైర్స్ ఆఫీసర్ క్రిస్టోఫర్ వైస్ వెల్లడించారు. అమెరికాలోని తన గ్లోబల్ వ్యాపార కార్యకలాపాలు, సాంకేతిక పరిష్కారాలు, ఇంజినీరింగ్ సేవలకు మద్దతుగా ఈ కేంద్రంలో కంపెనీ దీర్ఘకాలిక పెట్టుబడులు పెడుతోంది. మొదటి ఏడాదిలోనే 500 మంది ఉద్యోగులను నియమించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ, 2027 చివరి నాటికి ఈ సంఖ్యను 2,000కు పెంచనుంది.
హైదరాబాద్లో చార్లెస్ స్క్వాబ్ సెంటర్ ప్రారంభం
- Advertisement -
- Advertisement -


