– డీహెచ్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి యంగల ఆనందరావు
నవతెలంగాణ-సత్తుపల్లి
సత్తుపల్లి పట్టణంలోని చాకలి ఐలమ్మ భవన్లో పెళ్లి భాస్కర్ అధ్యక్షతన సత్తుపల్లి, వేంసూరు మండలాల దళిత హక్కుల పోరాట సమితి (డీహెచ్పీఎస్) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆ పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి యంగల ఆనందరావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రిజర్వేషన్లు అనేవి ఏ ప్రభుత్వమూ ఇచ్చే ఉచిత కానుకలు కావని ఆయన స్పష్టం చేశారు. శతాబ్దాలుగా అణచివేత, అంటరానితనం, సామాజిక బహిష్కరణకు గురైన దళితులు, వెనుకబడిన వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని ఆయన అన్నారు. కుల వ్యవస్థను పూర్తిగా నిర్మూలించకుండా రిజర్వేషన్లు రద్దు చేయాలని కోరడం సామాజిక అసమానతలను కొనసాగించడమే అవుతుందని మండిపడ్డారు. రిజర్వేషన్ల సమీక్ష పేరుతో వాటి ప్రాతిపదికను దెబ్బతీయడం, కుల ఆధారిత సమస్యను కేవలం ఆర్థిక అంశంగా చూపడం అత్యంత ప్రమాదకరమన్నారు.
మెరిట్ పేరుతో సామాజిక వెనుకబాటుతనాన్ని దాచిపెట్టడం ఎంతమాత్రం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. సమాన అవకాశాలు లేని సమాజంలో కేవలం పోటీలను మాత్రమే సమానం అని ప్రకటించడం నిజమైన సమానత్వం కాదన్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకంగా జరుగుతున్న దుష్ప్రచారంలో యువతను తప్పుదోవ పట్టించే యత్నాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని సామాజిక న్యాయ స్ఫూర్తిని కాపాడేందుకు దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలు ఐక్యంగా పోరాడాలన్నారు. రిజర్వేషన్ల రక్షణతో పాటు ప్రభుత్వ రంగ ఉద్యోగాల సంఖ్యను పెంచాలని ఆనందరావు డిమాండ్ చేశారు.
విద్యాసంస్థల విస్తరణ చేపట్టి, పెండింగ్లో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. దళిత సబ్ప్లాన్ నిధులను సమర్థవంతంగా వినియోగించి, అర్హులకు భూహక్కులు కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. న్యాయమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. రిజర్వేషన్లపై దాడి చేయడం అంటే రాజ్యాంగం అందించిన సామాజిక న్యాయంపై దాడి చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో రాజ్యాంగ పరిరక్షణ కోసం దళిత వర్గాలు మరిన్ని ఉద్యమాలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పోరాట సమితి జిల్లా ఆర్గనైజింగ్ కార్యదర్శి యామాల గోపాలరావు, సత్తుపల్లి నియోజకవర్గ కన్వీనర్ తడికమల్ల యోబు పాల్గొన్నారు. జిల్లా నాయకులు వేము రాంబాబు, పెరుమాళ్ళపల్లి ప్రకాశరావు, గుండెపొంగు మహేష్, మహిళా నాయకురాళ్లు కే. రామలక్ష్మి, తడికమళ్ళ రాధ, కాంపల్లి మరియమ్మ పాల్గొన్నారు. రిజర్వేషన్ల పరిరక్షణకు ఏకమై పోరాడాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది.



