– సీపీఐ(ఎం) మండల కార్యదర్శి జాజిరి జ్యోతి
– మండల స్థాయి ప్రజావాణిలో వినతిపత్రం అందజేత
నవతెలంగాణ – సత్తుపల్లి
సత్తుపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో నిలిచిపోయిన ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణాలను వెంటనే పునఃప్రారంభించాలని సీపీఐ(ఎం) సత్తుపల్లి మండల కార్యదర్శి జాజిరి జ్యోతి ప్రభుత్వాన్ని కోరారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో జ్యోతి మండల కమిటీ బాధ్యులతో కలిసి సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023లో సత్తుపల్లి మండలంలోని సిద్ధారం, గంగారం, కిష్టారం, రామగోవిందాపురం, తుంబూరు, నారాయణపురం, పాకలగూడెం, బేతుపల్లి, రేజర్ల, కాకర్లపల్లి, బుగ్గపాడు గ్రామాలలో ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం రూ. 2.75 కోట్లు కేటాయించిందని తెలిపారు.
ఇందులో భాగంగా ఒక్కో కమ్యూనిటీ హాల్కు రూ. 25 లక్షలు మంజూరయ్యాయని పేర్కొన్నారు. గ్రంథాలయం, రీడింగ్ రూమ్లతో కూడిన ఈ భవనాల నిర్మాణాలను కాంట్రాక్టర్లు సగంలోనే నిలిపివేసి వదిలేయడంతో ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యపై సంబంధిత అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు శాశ్వత పరిష్కారం లభించలేదని తెలిపారు. ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, సంబంధిత అధికారులతో తక్షణమే విచారణ జరిపించి, నిలిచిపోయిన పనులను పునఃప్రారంభించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కువ్వారపు లక్ష్మణరావు, తడికమళ్ల రామకృష్ణ, అయినంపూడి సనందరావు, ఫరీదా, ఆంగోతు చిట్టెమ్మ, శారద తదితరులు పాల్గొన్నారు.



