ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల సనత్ నగర్ టిమ్స్ను ఘనంగా ప్రారంభించారు. విద్య, వైద్య రంగాలే తమ ప్రభుత్వానికి ప్రాధాన్యతారంగాలని ఆయన నొక్కి చెప్పారు. వాటికి ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామంటూ ప్రకటించారు. ఇది నిజంగా హర్షించదగ్గ విషయమే. అయితే ఇప్పటిదాకా ఈ రంగాలను ప్రభుత్వాలు చూసిన తీరు, బడ్జెట్ కేటాయింపులు, ఖర్చును పరిశీలిస్తే… మాటలు ఘనం.. చేతలు శూన్యమని చెప్పకతప్పదు. ఆరోగ్య శ్రీ లాంటి పథకాలను ప్రభుత్వం ప్రవేశ పెట్టినా అవి పేదోడికి పూర్తిస్థాయిలో ఆరోగ్య భద్రత, భరోసానివ్వలేకపోతున్నాయి. గ్రామస్థాయి నుంచి హైదరాబాద్ వరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, జిల్లా కేంద్ర ఆస్పత్రులు, వైద్య కళాశాలల్లో డాక్టర్లు, సిబ్బంది లేమి, మౌలిక వసతులు, మందుల లేమి వెక్కిరిస్తున్నాయి. దీంతో అనివార్యంగా పేదలు… తమకున్న ఆస్తిపాస్తులనమ్మి ప్రయి వేటు, కార్పొరేట్ వైపు పరుగులు తీయాల్సిన దుస్థితి.
ఇటీవల నల్లగొండ జిల్లా చండూరుకు చెందిన ఓ వ్యక్తికి రోడ్డు ప్రమా దానికి గురయ్యాడు. లారీ డ్రైవర్గా జీవిస్తున్న అతడు ఆ ప్రమాదంలో తీవ్ర గాయాలపాల య్యాడు. జిల్లా కేంద్రంలో సరైన వైద్యమందక పోవటంతో అత్యవసర వైద్య సేవల నిమిత్తం హైదరాబాద్లోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ఆ ప్రమాదానికి, దాని వైద్యానికి ఆరోగ్య శ్రీ వర్తించదు పొమ్మనటంలో అయిన కాడికి వడ్డీకి అప్పులు తెచ్చి రూ.3 లక్షల వరకు ఖర్చు చేయాల్సి వచ్చింది. పోనీ ముఖ్యమంత్రి సహాయ నిధి (సీ.ఎం.ఆర్.ఎఫ్)కి దరఖాస్తు చేసుకుందామా? అంటే అది ఉన్నతా ధికారుల దయ.. మన ప్రాప్తం అన్నట్టుగా తయారైంది. రూ. లక్ష ఖర్చయితే, రూ.40 వేలే ఇస్తామనే నిబంధనలు పేదల పాలిట శాపంగా మారాయి. దీంతో మిగతా అప్పును తీర్చేందుకు రోగులు, బాధితులు నానా అగచాట్లు పడాల్సిన పరిస్థితి.
మరోవైపు ఆదివాసీ, గిరిజన గూడేలు, తండాల్లో వర్షాకాలంలో రోగాలు ముసురుకోవటం పరిపాటి. కానీ ప్రభుత్వం, అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవటంతో అక్కడి ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. భద్రాచలం ఏరియా ఆస్పత్రి… తెలంగాణతో పాటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్ర ప్రదేశ్లోని వేలాది మంది పేద రోగులకు సేవలందిస్తోంది. ఇక్కడికి వచ్చే వారిలో ఎనభై శాతానికి పైగా ఆదివాసీ రోగులే ఉంటారు. కానీ ఐటీడీఏ నుంచి నిధులు రాకపోవటంతో ఆస్పత్రి నిర్వహణ అధ్వాన్నంగా మారిందనేది స్థానిక ప్రజల ఆవేదన. 62 మంది వైద్యులు ఉండాల్సిన చోట 22 మందే ఉండటం, ఆర్థోపెడిక్, చిన్న పిల్లల డాక్టర్లు, ఈఎన్టీ స్పెషలిస్టులు, జనరల్ సర్జన్ల కొరత ఈ ఆస్పత్రిని వేధిస్తున్నాయి. దీంతో ఆదివాసీ ప్రాంతాలకు కీలకమైన ఈ దవాఖానా నుంచి అడవి బిడ్డలకు సరైన వైద్యం అందటం లేదు. దీంతోపాటు వేలాది మంది రోగులకు సేవలందించే నల్లగొండ, మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న యాచారం కమ్యూనిటీ హెల్త్ సెంటర్ తీవ్ర నిర్లక్ష్యంతో కొట్టుమిట్టాడుతోంది. నూతన భవన నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరైనా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అనే చందంగానే ఉంది. మంచినీటి కొరత, డ్రైనేజీ లీకవటం తదితర మౌలిక సదుపాయాలు రోగులను వెక్కిరిస్తున్నాయి. కిటికీలు, తలుపులు లేకపోవటంతో రోగులు వానకు, చలికి గజగజ వణికిపోతు న్నారు. ఈ రెండు ఉదాహరణలు మచ్చుకు మాత్రమే. ఇలాంటివి రాష్ట్రంలో అనేకం.
ఇవి ప్రభుత్వ వైద్యం పట్ల పాలకుల ఉదాసీనతకు, నిర్లక్ష్యానికి ప్రత్యక్ష ఉదాహరణలు. ప్రపంచీకరణ, సరళీకరణ, ప్రయివేటీకరణ విధానాలు అమల్లోకి వచ్చిన తర్వాత పేదలకు అందించే వివిధ సేవల బాధ్యతల నుంచి తప్పుకోవటం ప్రభుత్వాలకు రివాజుగా మారింది. నిధులు కేటాయించి చేతులు దులుపుకోవటం తప్ప వాటి నిర్వహణ బాధ్యత తమది కాదనే విధంగా పాలకులు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటిదాకా ఇదే తంతు. అది కాంగ్రెస్ అయినా, టీడీపీ అయినా, బీఆర్ఎస్ అయినా ఇదే పోకడ. ఇక్కడే ఒక వాస్తవం మన కండ్ల ముందు కదలాడుతోంది. ఎంత కాదనుకున్నా ప్రభుత్వం అనేది పేదల ప్రయోజనం కోసం ఎంతోకొంత పని చేస్తుంది కాబట్టి… దాని నుంచి సేవలు పొందే హక్కు, అధికారం ప్రజలకు ఉంటాయి. కానీ ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలకు తమ తమ లాభాలే పరమావధి. కాబట్టి ఆరోగ్య బీమా, ఆరోగ్య శ్రీలాంటివి ఎన్ని ఉన్నా… అవి ప్రభుత్వ వైద్యానికి సాటి రావు. హెల్త్ స్కీముల పేరిట బుకాయిం చకుండా వాటికి వెచ్చించే నిధులను ప్రభుత్వ దవాఖానాలపై ఖర్చు పెడితే ఒకటికి పదింతలు సేవలందించటం ఖాయం. హైదరాబాద్లోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్, వరంగల్ ఎంజీఎం లాంటి ఆస్పత్రులపై భారాన్ని తగ్గించాలంటే ముందు గ్రామీణ ప్రాంతాల్లోని వైద్య సేవలను బలోపేతం చేయాలి. ఆ తర్వాత ద్వితీయ శ్రేణి ఆస్పత్రులు, వైద్య కళాశాలలపై దృష్టి సారించాలి. అప్పుడే ఆరోగ్య తెలంగాణ సాధ్యం.
వైద్యం.. ప్రభుత్వ చోద్యం…
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



