నవతెలంగాణ – హైదరాబాద్ : అమెరికాలో మరోసారి తుపాకీ కాల్పుల ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. సియాటెల్ నగరంలో చోటుచేసుకున్న ఈ దుర్ఘటనలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా, మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలో అత్యంత వైభవంగా జరుగుతున్న “బైట్ ఆఫ్ సియాటెల్” ఫుడ్ ఫెస్టివల్ వేదికగా ఈ హింసాత్మక ఘటన చోటుచేసుకోవడం స్థానికంగా ఆందోళన రేకెత్తిస్తోంది.
ఘటనకు సంబంధించిన వివరాల ప్రకారం.. సియాటెల్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన స్పేస్ నీడిల్ సమీపంలో ఈ కాల్పులు జరిగాయి. గాయపడిన వారిలో రెండేళ్ల బాలుడు కూడా ఉన్నట్లు స్థానిక పోలీసులు ధ్రువీకరించారు. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగిన భద్రతా దళాలు ఘటనా స్థలాన్ని తమ అధీనంలోకి తీసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు మృతి చెందగా, మరో ఐదుగురు గాయపడిన విషయాన్ని పోలీసులు అధికారికంగా ప్రకటించారు. పరిస్థితి దృష్ట్యా ప్రజలెవరూ ఆ ప్రాంతానికి రావద్దని హెచ్చరికలు జారీ చేశారు.



