బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త రమాదేవి
నవతెలంగాణ – ముధోల్
గత బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను యధావిధిగా అమలు చేయాలని ముధోల్ బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త పి. రమాదేవి అన్నారు. నియోజకవర్గ కేంద్రమైన ముధోల్ లో మంగళవారం రోజు తాసిల్దార్ కార్యాలయం ముందర ధర్నా నిర్వహించారు. పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తాసిల్దార్ శ్రీలతకు బీఆర్ఎస్ నాయకులు అందజేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారన్నారు.
ఈ పథకాల అమలులో ఎలాంటి ఆటంకాలు లేకుండా, ప్రభుత్వం తక్షణమే న్యాయపరమైన చర్యలు చేపట్టాలని కోరారు. కెసిఆర్ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద మధ్య తరగతి కుటుంబాలకు అండగా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని తొలగించే ప్రయత్నం చేయడం పద్ధతి కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు సైతం నెరవేర్చక , అమల్లో ఉన్న పథకాలను తీసే ప్రయత్నం చేయటం సరికాదన్నారు. ఆనంతరం నయబాది వద్ద అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు అశోక్ ,పోశెట్టి తరోడ మాజీ ఎంపిటిసి బండారి గంగాధర్, నాయకులు శ్రీకాంత్ చారి, పి. గంగారెడ్డి, బాబు సాయి రెడ్డి, భూమరెడ్డి, భోజరెడ్డి ఇస్మాయిల్ ,లతీఫ్, చిన్నన్న, నగేష్ ,తులసిరాం ,తదితరులు, పాల్గొన్నారు.



