– పెట్టుబడులపై మెరుగైన రాబడులు
– రిట్స్, ఇన్విస్ట్ క్యాంపెయిన్లో నిపుణులు
నవతెలంగాణ – హైదరాబాద్
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రిట్స్)లో పెట్టుబడులు మెరుగైన రాబడులు అందిస్తాయని ఆ రంగం నిపుణులు పేర్కొన్నారు. భవిష్యత్తులో రియాల్టీ వృద్ధిలో ఇవి కీలక పాత్ర పోశించనున్నాయన్నారు. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం బుధవారం హైదరాబాద్లో ఇండియన్ రీట్స్ అసోసియేషన్, భారత్ ఇన్విట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. బ్రూక్ఫీల్డ్ ప్రాపర్టీస్ ప్రెసిడెంట్ అకింత్ గుప్తా, నెక్సస్ సెలెక్ట్ ట్రస్ట్ సీఎఫ్ఓ రాజేష్ డీఈఓ, క్యూబ్హైవే ఇన్విట్ సీఈఓ వినరు శేఖర్, అంజెన్ ఇండియా ఎనర్జీ కాపిటల్ మార్కెట్స్ హెడ్ సుజయ మోఘెపద్యే మాట్లాడారు. రిట్స్, ఇన్విట్లు రెండింటినీ సెబీ నియంత్రిస్తుందన్నారు. ఇవి భారతదేశ రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల రంగాలలో వృద్థిని నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. రిట్స్ ఆదాయాన్ని సృష్టించే రియల్ ఎస్టేట్ను కలిగి ఉన్న లేదా నిర్వహించే సంస్థలు. పెట్టుబడిదారులు నేరుగా ఆస్తులను కొనుగోలు చేయకుండా ఆదాయంలో వాటాను పొందడానికి ఇవి అనుమతిస్తాయన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు (ఇన్విట్లు) రోడ్లు, పంపిణీ, పైప్ లైన్లు, టెలికాం, వేర్ హౌసింగ్ లాంటి వివిధ మౌలిక సదుపాయాల రంగాలలో ఆదాయాన్ని సృష్టించే ఆస్తులను కలిగి ఉన్నాయన్నారు. గడిచిన ఐదేండ్లల్లో వీటిల్లో పెట్టుబడులపై సగటున 17.1 శాతం రాబడి ఉందన్నారు. ఇన్విట్స్ ఎయుఎం రూ.5 లక్షల కోట్లకు చేరిందన్నారు.