రేషన్ కార్డు దరఖాస్తు పెండింగ్పై ఆవేదన..నెలలు గడిచినా పరిష్కారం లేదు
నవతెలంగాణ – ఉప్పునుంతల
నెలలు గడిచినా రేషన్ కార్డు దరఖాస్తు ఇన్స్పెక్టర్ పరిధిలో ముందుకు సాగకపోవడంతో రాయిచేడ్ గ్రామానికి చెందిన దరఖాస్తు దారుడు దొడ్ల ప్రశాంత్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. నూతనంగా వివాహం జరిగి సంవత్సరం పూర్తవుతున్నా, తమ కుటుంబానికి వేరుగా కొత్త రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ అధికారులు స్పందించడంలేదని పేర్కొన్నారు.
ఇప్పటికే పాత రేషన్ కార్డులో తమ ఇద్దరి పేర్లు తొలగించబడటంతో ఇప్పుడు మూడు నెలలా రేషన్ బియ్యం అందక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. నోటికాడి మెతుకులు అందేనా అనే స్థితికి చేరుకున్నామని వాపోయారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు స్పందించి, తమ దరఖాస్తును వెంటనే పరిశీలించి ముందుకు సాగేలా మండల ఎమ్మార్వో తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.



