- చర్చల పేరుతో ఏడాదికి పైగా సాగుతున్న జాప్యంతో విసిగిపోయిన తల్లిదండ్రులు
నవతెలంగాణ-హైదరాబాద్: రామంతపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పిఎస్) ప్రధాన ద్వారం వద్ద వందలాది మంది విద్యార్థుల తల్లిదండ్రులు భారీ నిరసన చేపట్టారు. 141% ఫీజు పెంపును నిరసిస్తూ రోడ్డుపై బైటాయించారు. ఏడాది పాటు చర్చల పేరుతో కాలాయాపన చేశారని, కానీ ఎలాంటి పురోగతి లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. రామంతపూర్లో జరుగుతున్న నిరసనలకు హెచ్పిఎస్ బేగంపేట్ శాఖకు చెందిన తల్లిదండ్రుల ప్రతినిధులు కూడా సంఘీభావం తెలిపారు. ఈ రెండు శాఖలు కలిసి “ఫీజుల సమ్మె”ను సంయుక్తంగా ప్రకటించాయి. ఫీజులలో 0% పెరుగుదల ఉండదని పాఠశాల యాజమాన్యం లిఖితపూర్వక హామీ ఇచ్చే వరకు మొదటి టర్మ్ ఫీజు చెల్లింపులన్నింటినీ నిలిపివేయాలని తల్లిదండ్రులు సమిష్టిగా తీర్మానించారు. అదే విధంగా చట్టబద్ధంగా ఎన్నుకోవలసిన తల్లిదండ్రుల-ఉపాధ్యాయుల సంఘాన్ని (PTA) తక్షణమే ఏర్పాటు చేయాలని, తక్షణమే ప్రిన్సిపాల్ ను తొలగించాలని డిమాండ్ చేశారు.
తల్లిదండ్రుల కోర్ కమిటీ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, గత నాలుగేళ్లలో ఫీజులు ఏకంగా 141% పెరిగాయి. 2021లో ఒక్కో విద్యార్థి ఫీజు సుమారుగా ₹83,630 ఉండగా, 2025 నాటికి అది ₹2,01,628 మార్కును దాటింది. పాఠశాల భవిష్యత్ నిర్వహణ ఖర్చులను భరించడానికి ఇప్పటికే వసూలు చేసిన భారీ ఫీజుల పెంపు సరిపోతుందని, రాబోయే ఐదేళ్లపాటు ఫీజులను ప్రస్తుత స్థాయిలోనే కొనసాగించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.



