నవతెలంగాణ – మునుగోడు
ఒకరి సిలిండర్ ఒకరికి ఇవ్వడం, అక్రమాలకు పాల్పడటం వంటి “తెలివి తేటలు” ప్రదర్శిస్తే గ్యాస్ డెలివరీ బాయ్ ల పై క్రిమినల్ కేసులు నమోదు చేయడం తధ్యం అని పౌర సరఫరాల శాఖ ఎన్ఫోర్స్మెంట్ డిటీ మాచన రఘునందన్ హెచ్చరించారు. బుధవారం ఆయన మునుగోడు లో మాట్లాడుతూ.. చిట్యాల, నల్గొండ కు చెందిన గ్యాస్ ఏజన్సీ ల డెలివరీ బాయ్ లు సిలిండర్ల ను ఒకరికి చెందినవి, మరొకరికి ఇచ్చి అక్రమాలకు పాల్పడుతున్నారన్న సంగతి తన దృష్టికి వచ్చిందన్నారు.
పాస్ పుస్తకాల ను దగ్గర ఉంచుకుని, డెలివరీ లో ఇష్టారాజ్యంగా ప్రవర్తించే గ్యాస్ డెలివరీ బాయ్ ల పై నేరుగా కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. గృహ వినియోగ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ల తాత్కాలిక కొరత ను కొన్ని గ్యాస్ ఏజెన్సీలు, డెలివరీ బాయ్ లు తమ దందా కు అనుకూలంగా మలచుకున్నారని రఘునందన్ ఆక్షేపించారు. ఈ అలవాటు కు స్వస్తి పలకక పోతే జైలు కు పంపడం ఖాయం అని రఘునందన్ స్పష్టం చేశారు.



