– రోడ్డు ప్రమాదాలపై ఆరా
నవతెలంగాణ – అశ్వారావుపేట
మల్టీ జోన్-1 ఐజీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి శుక్రవారం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. అశ్వారావుపేట నియోజకవర్గంలోని దమ్మపేటలో ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక లో భాగంగా నిర్వహించిన ఎరైవ్ – ఎలైవ్ అవగాహనా సదస్సు కు ఆయన హాజరై తిరుగు ప్రయాణం లో అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ లోని సిబ్బంది పనితీరును, కార్యాలయ పరిసరాలను పరిశీలించారు.
స్టేషన్ పరిధిలో ఇటీవల చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదాలపై వివరాలు తెలుసుకుని, వాటి నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజల భద్రత దృష్ట్యా ట్రాఫిక్ నియంత్రణను కట్టుదిట్టం చేయాలని, ప్రమాదాల తగ్గింపు కు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అలాగే పోలీస్ సిబ్బంది ప్రజలకు సానుకూల సేవలు అందిస్తూ, సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు. ఆయన వెంట ఎస్పీ రోహిత్ రాజు, డీఎస్పీ సతీష్ కుమార్,సీఐ నాగరాజు రెడ్డి, అశ్వారావుపేట, దమ్మపేట ఎస్ హెచ్ ఓ లు,ఎస్ఐ లు యయాతి రాజు,సాయి కిశోర్ రెడ్డి, అఖిల లు పాల్గొన్నారు



