నవతెలంగాణ – అశ్వారావుపేట
రైతుల కష్టార్జిత భూములను, వారి జీవనాధారమైన బండ్ల దారులను లక్ష్యంగా చేసుకుని ఎర్ర మట్టి మాఫియా బీభత్సం సృష్టిస్తోంది. వినాయకపురం గ్రామానికి చెందిన కొండయ్య, నారాయణపురానికి చెందిన మేకల వెంకన్న బాబు లు ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తవ్వి అక్రమంగా అమ్ముకుంటూ రైతులను నష్టాల్లోకి నెట్టేస్తున్నారు.
రైతులు రోజూ పంట పనులకు ఉపయోగించే బండ్ల దారిని పూర్తిగా తవ్వేసి, రాకపోకలు నిలిచిపోయేలా చేశారు. రైతులు ప్రశ్నిస్తే “రేపు మట్టి పోసి సరిచేస్తాం” అంటూ మాటలతో తప్పించుకుంటూ, వాస్తవానికి మట్టిని పూర్తిగా అమ్మేసుకుంటున్నారు. ఇది నేరుగా రైతుల జీవనాధారంపై దాడి చేసినట్లే అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే వ్యక్తులు గతంలో కూడా 20 గుంటల భూమిలోని మట్టిని రూ.2 లక్షలకు అమ్మి, పంట పండించే వరి పొలాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఇప్పుడు అదే విధంగా భూములను గోతులుగా మార్చి, రైతులకు ఉపయోగం లేకుండా చేస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాల వల్ల భూములు పాడైపోతుండగా, పంటలు వేయడానికి కూడా అనుకూల పరిస్థితులు లేకుండా పోతున్నాయి.
అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఇది మట్టి మాఫియాకు అండగా నిలుస్తున్నట్టే అని రైతులు మండిపడుతున్నారు.
వెంటనే అక్రమ తవ్వకాలను నిలిపివేయాలి,రైతుల బండ్ల దారులను తక్షణమే పునరుద్ధరించాలి,బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి,లేకపోతే రైతులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.



