నవతెలంగాణ-హైదరాబాద్: ఇరాన్-ఇజ్రాయిల్ దేశాల మధ్య ఉద్రికత్తలు పెరిగి భీకర దాడులతో పశ్చిమాసియా దద్దరిల్లుతోంది.దీంతో ఇరు దేశాల్లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూ ద్వారా ఆయా దేశాల నుంచి భారతీయులు సురక్షితంగా ఇండియాకు తరలించడానికి భారత్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇలాంటి తరుణంలో భారత్కు చెందిన ఒక ఇంజనీర్ ఇరాన్లో అదృశ్యమయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు భయాందోళన చెందుతున్నారు. తమకు సాయం చేయాలంటూ భారత ప్రభుత్వాన్ని బాధిత కుటుంబం వేడుకుంది.
బీహార్కు చెందిన 25 ఏళ్ల సిరాజ్ అలీ అన్సారీ.. ఓ ప్రైవేటు కంపెనీలో ఇంజనీర్గా పని చేస్తున్నాడు. అతడితో పాటు మరికొంత మంది ఇరాన్లో ఒక ప్లాంట్ నిర్మాణం కోసం పని చేస్తున్నారు. జూన్ 9న సౌదీ అరేబియా మీదుగా సిరాజ్ ఇరాన్ చేరుకున్నాడు. ఇంతలోనే ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు దిగింది. ఆపరేషన్ రైజింగ్ లయన్ పేరుతో ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది.
అయితే సిరాజ్ పని చేస్తున్న ప్రాంతంలో క్షిపణి దాడులు జరిగాయి. అక్కడ వారిని వేరే ప్రాంతాలకు తరలించారు. జూన్ 17న సిరాజ్తో కుటుంబ సభ్యులు చివరి సారిగా ఫోన్లో మాట్లాడారు. అప్పటి నుంచి సిరాజ్ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. దీంతో కుటుంబ సభ్యులు భయాందోళనకు గురై ఇరాన్లో భారత రాయబార కార్యాలయాన్ని సంప్రదించారు. తమ బిడ్డ ఆచూకీ గుర్తించాలని వేడుకున్నారు. మరోవైపు భారత ఎంబసీ ఇరాన్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నారు.