ఆదివాసి దినోత్సవాన్ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలి..
తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం (టిఏజిఎస్ )
నవతెలంగాణ – కాటారం/మహాముత్తారం
గ్రామ గ్రామాన జెండా పండుగలు నిర్వహించాలని, తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ ఆదివాసి ప్రజానీకానికి పిలుపునిచ్చారు. శుక్రవారం రోజున మహా ముత్తారం మండలం పోలంపల్లి గ్రామంలో తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జెండా పండుగలు గ్రామ గ్రామాన నిర్వహిస్తూ ఆదివాసుల యొక్క సంస్కృతి, సంప్రదాయాలు, కలలు పరిరక్షించుకునే విధంగా ప్రతి గ్రామంలోని గ్రామ పెద్దలు మేధావులు, ఉద్యోగులు, విద్యార్థిని, విద్యార్థులు, యువతీ, యువకులు,కళాకారులు, మేధావులు పాల్గొని ప్రతి ఒక్కరు ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని అన్నారు.
ఐక్యరాజ్యసమితి ఆదివాసి ప్రాంతాల మీద దశాబ్ద కాలం పాటు అధ్యయనం చేసి ఆదివాసి సంస్కృతి, సాంప్రదాయాలు, జీవన విధానం ఇతర సమాజాలకు భిన్నంగా ఉందని, ఏ దేశంలో నైనా పరిపాలకుల విధానాల వల్ల ఆదివాసి మనగడకే ప్రశ్నార్థకం అవుతుందని ఏ దేశంలో నైనా పాలకులు ఆదివాసి అభివృద్ధి పట్ల ఆదివాసి మనుగడను ప్రశ్నార్థకం చేసే విధానాలను అనుసరించవద్దని వారి అభివృద్ధికి దోహదపడాలని సూచించినప్పటికీ, ఆదివాసీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తూ నిరంతరం ఆదివాసి హక్కుల మీద ఆదివాసి అస్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా పరిపాలన సాగుతుందని అన్నారు. ఈ అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని, ప్రభుత్వాల యొక్క ఆదివాసి వ్యతిరేక విధానాలను ప్రతి ఆదివాసి ప్రశ్నించాలని పిలుపునిచ్చారు.
అదేవిధంగా ఆదివాసి దినోత్సవాన్ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు, ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవు దినం ప్రకటించినప్పుడే,ఆదివాసి సమాజంలో ఉన్న మేధావులుగా ప్రజలందరినీ చైతన్యం చేసి వారు స్వేచ్ఛగా పాల్గొనడానికి అవకాశం ఉంటుందని, అలాంటి చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబించాలని లేనిపక్షంలో ఆదివాసి వ్యతిరేక ప్రభుత్వాలుగా మిగులుతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు మేకల రాజు, కాపుల విజయ్, తెలంగాణ ఆదివాసి విద్యార్థి సంఘం నాయకులు మడకం నిర్మ ,గుంటి అంజలి ,తోట చందన ,గుండాపూ తేజ అశ్విని గుండం, రామ్ చరణ్, తదితరులు ఉన్నారు.