హాజరైన అదనపు కలెక్టర్ వేణుగోపాల్
నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ ప్రభుత్వం ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” కార్యక్రమాన్ని నియోజకవర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లోని రైతు వేదిక లో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా అదనపు కలెక్టర్ వేణుగోపాల్ హాజరయ్యారు.
ఇందులో ప్రభుత్వ ప్రధాన పథకాల పై ప్రజలకు అవగాహన కల్పించడం, పాలనలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించడం, స్థానిక సమస్యలను గుర్తించి పరిష్కార మార్గాలను రూపొందించడం ప్రధాన లక్ష్యాలుగా పేర్కొన్నారు. రాష్ట్ర గీతం ఆలాపన అనంతరం మండల స్థాయి ప్రభుత్వ భాగాల అధికారులు రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, మహాలక్ష్మి పథకం, గృహ జ్యోతి, పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి ప్రస్తుత పథకాలతో పాటు బ్రేక్ ఫాస్ట్ పథకం, కుటుంబ జీవితం బీమా, సహజ వ్యవసాయం వంటి రాబోయే పథకాల వివరాలు ప్రజలకు వివరించారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ దాసరి కిశోర్ ,మండల పరిషత్ ప్రత్యేక అధికారి, పశుసంవర్ధక శాఖ అదనపు సంచాలకులు డాక్టర్ ప్రదీప్ కుమార్ ,ఎంపీడీవో అప్పారావు, ఎంఈఓ ప్రసాదరావు లు పాల్గొన్నారు.



