నవతెలంగాణ-హైదరాబాద్: కేరళ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన విజింజం అంతర్జాతీయ ఓడరేవును తిరువనంతపురంలో ప్రధాని మోడీ శుక్రవారం ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా తిరువనంతపురంలో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు. ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రెండు రోజుల పర్యటన కోసం మోడీ గురువారం సాయంత్రం రాష్ట్ర రాజధానికి చేరుకున్నారు. తరువాత ఆయన కేరళ రాజ్ భవన్కు వెళ్లారు. అక్కడే రాత్రి బస చేశారు. ఆయన ఉదయం 9.45 గంటల ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా విజింజంకు తన ప్రయాణాన్ని ప్రారంభించనున్నారు. అన్ని వాతావరణాలలో పనిచేసే ఓడరేవు అయిన విజింజం అంతర్జాతీయ ఓడరేవు శుక్రవారం భారత సముద్ర వాణిజ్య చరిత్రలో కొత్త చరిత్రను లిఖించనుంది. భారతదేశ సముద్ర రవాణాకు కీలకమైన కేంద్రంగా మారనున్నది. దేశంలో మొట్టమొదటి సెమీ ఆటోమేటెడ్ ఓడరేవు అయిన విజింజం ఓడరేవు ప్రపంచవ్యాప్తంగా అత్యంత సాంకేతికంగా అధునాతనమైన ట్రాన్స్షిప్మెంట్ ఓడరేవులలో ఒకటిగా నిలిచింది. ఇది నౌకల టర్న్అరౌండ్ సమయాన్ని తగ్గిస్తుంది. భారతదేశం పెద్ద కంటైనర్ ఓడలను నిర్వహించే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ ఓడరేవు అంతర్జాతీయ ఓడరేవులపై ఆధారపడటాన్ని కూడా తగ్గిస్తుందని భావిస్తున్నారు. కేరళలో విజింజం ఓడరేవును ప్రారంభించిన తర్వాత అమరావతి నిర్మాణ పనులను తిరిగి ప్రారంభించనున్నారు.