– గతేడాది కన్నా ఫస్టియర్లో 5.83 శాతం, సెకండియర్లో 1.91 శాతం పెరుగుదల
– అబ్బాయిల కన్నా ఫస్టియర్లో 14,06 శాతం, సెకండియర్లో 13.13 శాతం అధికం
– ప్రథమ సంవత్సరంలో మేడ్చల్ అగ్రస్థానం, మెదక్ ఆఖరిస్థానం
– ద్వితీయ సంవత్సరంలో ములుగు ప్రథమం, కామారెడ్డి అధమం
– ఫస్టియర్లో 66.89 శాతం, సెకండియర్లో 71.37 శాతం ఉత్తీర్ణత
– మే 22 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
– నేటినుంచి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తుల స్వీకరణ
– సమర్పణకు తుది గడువు 30 : ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ వార్షిక ఫలితాలను మంగళవారం హైదరాబాద్ నాంపల్లిలోని ఇంటర్ బోర్డులో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొన్నం ప్రభాకర్ విడుదల చేశారు. ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత పెరిగింది. గతేడాది కన్నా ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 14.06 శాతం, ద్వితీయ సంవత్సరంలో 13.13 శాతం పెరగడం గమనార్హం. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 66.89 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ద్వితీయ సంవత్సరంలో 71.37 శాతం ఉత్తీర్ణులయ్యారు. గతేడాది ఇంటర్ ఫస్టియర్లో 61.06 శాతం, ద్వితీయ సంవత్సరంలో 69.46 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలే హవా కొనసాగించారు. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరంలోనూ వారే పైచేయి సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో 4,39,302 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 2,93,852 (66.89 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 2,23,407 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరుకాగా, 1,64,876 (73.8 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 2,15,895 మంది అబ్బాయిలు పరీక్షలు రాస్తే, 1,28,976 (59.74 శాతం) మంది పాసయ్యారు. అబ్బాయిల కంటే అమ్మాయిలు 14.06 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఒకేషనల్ విభాగంలో 49,128 మంది పరీక్ష రాస్తే, 28,339 (57.68 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. ఇందులో 24,860 మంది అమ్మాయిలు పరీక్షలు రాయగా, 18,418 (74.09 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. 24,268 మంది అబ్బాయిలు పరీక్షలు రాస్తే, 9,921 (40.88 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే ఒకేషనల్ విభాగంలోనూ అబ్బాయిల కన్నా అమ్మాయిలు 33.21 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత పొందారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగం రెగ్యులర్లో 3,99,943 మంది పరీక్షలకు హాజరుకాగా, 2,85,435 (71.37 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 2,06,161 మంది అమ్మాయిలు పరీక్షలు రాస్తే, 1,60,244 (77.73 శాతం) మంది ఉతీర్ణత పొందారు. 1,93,782 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా, 1,25,191 (64.60 శాతం) మంది పాసయ్యారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరంలోనూ అబ్బాయిల కంటే అమ్మాయిలు 13.13 శాతం మంది అధికంగా ఉత్తీర్ణత పొందారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ జనరల్ విభాగం రెగ్యులర్లో 40,864 మంది పరీక్షలు రాస్తే, 28,713 (70.26 శాతం) మంది విద్యార్థులు పాసయ్యారు. ఇందులో 21,387 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరు కాగా, 18,222 (85.20 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 19,4770 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా, 10,491 (53.86 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఒకేషన్ విభాగంలోనూ అబ్బాయిల కన్నా అమ్మాయిలు 31.34 శాతం మంది అధికంగా ఉత్తీర్ణులయ్యారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య, ఇంటర్ బోర్డు పరీక్షల నియంత్రణాధికారి (సీవోఈ) జయప్రదబాయి, జాయింట్ సెక్రెటరీలు వసుంధర, మోహన్, జోత్స్నరాణి, భీంసింగ్, సీజీజీ డైరెక్టర్ జనరల్ రాజేంద్ర నిమ్జే తదితరులు పాల్గొన్నారు.
నేటినుంచి సప్లిమెంటరీ ఫీజు చెల్లింపు ప్రారంభం
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు వచ్చేనెల 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రతి రోజూ ఉదయం, మధ్యాహ్నం రెండు విడతల్లో పరీక్షలు జరుగుతాయి. బుధవారం నుంచి పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఫీజు చెల్లింపునకు తుది గడువు ఈనెల 30వ తేదీ వరకు ఉన్నది. జూన్ మూడు నుంచి ఆరో తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను నిర్వహిస్తారు. బుధవారం నుంచి రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసేందుకు తుది గడువు ఈనెల 30వ తేదీ వరకు ఉన్నది. రీకౌంటింగ్ కోసం ప్రతి పేపర్కూ రూ.100, రీవెరిఫికేషన్ కోసం ప్రతి పేపర్కూ రూ.600 చెల్లించాల్సి ఉంటుంది. విద్యార్థులు http://tgbie.cgg.gov.in వెబ్సైట్లో ఆన్లైన్ సేవలను వినియోగించుకోవాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. మార్కుల మెమోలను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. షార్ట్ మెమోలను ఇంటర్ బోర్డు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు.
ఫస్టియర్లో మేడ్చల్ అగ్రస్థానం
ఇంటర్ ఫలితాల్లో ప్రథమ సంవత్సరంలో 77.59 శాతంతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, ద్వితీయ సంవత్సరంలో 80.12 శాతంతో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచాయి. ఇంటర్ ప్రథమ సంవత్సరం జనరల్ విభాగంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుంచి 67,266 మంది పరీక్షలు రాయగా, 52,190 (77.59 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 36,502 మంది అబ్బాయిలు పరీక్షలు రాస్తే, 26,842 (73.54 శాతం) మంది పాసయ్యారు. 30,764 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరుకాగా, 25,348 (82.40 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. 76.95 శాతం ఉత్తీర్ణత సాధించి రంగారెడ్డి జిల్లా రెండో స్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుంచి 76,967 మంది పరీక్షలు రాయగా, 59,227 (76.95 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 70.49 శాతంతో ములుగు జిల్లా మూడో స్థానంలో ఉన్నది. ఈ జిల్లా నుంచి 3,995 మంది పరీక్షలు రాస్తే, 2,816 (70.49 శాతం) మంది పాసయ్యారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో 46.87 శాతం ఉత్తీర్ణతతో మెదక్ జిల్లా అట్టడుగున నిలిచింది. ఈ జిల్లా నుంచి 5,519 మంది పరీక్షలకు హాజరుకాగా, 2,587 (46.87 శాతం) ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్ ప్రథమ సంవత్సరం ఒకేషనల్ విభాగంలో 81.33 శాతం ఉత్తీర్ణతతో నారాయణపేట జిల్లా అగ్రస్థానంలో, 43.84 శాం ఉత్తీర్ణత సాధించి నిజామాబాద్ జిల్లా చివరిస్థానంలో నిలిచాయి.
సెకండియర్లో ములుగు ప్రథమం
ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగం రెగ్యులర్లో 80.12 శాతం ఉత్తీర్ణతతో ములుగు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుంచి 1,635 మంది పరీక్షలు రాస్తే, 1,310 (80.12 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 833 మంది అబ్బాయిలు పరీక్షలు రాయగా, 616 (73.95 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. 802 మంది అమ్మాయిలు పరీక్షలకు హాజరుకాగా, 694 (86.53 శాతం) మంది పాసయ్యారు. 79.52 శాతం ఉత్తీర్ణతతో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా రెండో స్థానంలో ఉన్నది. ఈ జిల్లా నుంచి 4,199 మంది పరీక్షలకు హాజరైతే, 3,339 (79.52 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 78.08 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మూడో స్థానంలో నిలిచింది. ఈ జిల్లా నుంచి 61,505 మంది పరీక్షలు రాస్తే, 48,022 (78.08 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగం రెగ్యులర్లో 54.93 శాతం ఉత్తీర్ణత సాధించి కామారెడ్డి జిల్లా అట్టడుగున నిలిచింది. ఈ జిల్లా నుంచి 6,485 మంది పరీక్షలు రాస్తే, 3,562 (54.93 శాతం) మంది ఉత్తీర్ణత పొందారు. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఒకేషనల్ విభాగంలో 88.46 శాతం ఉత్తీర్ణతతో ములుగు జిల్లా ప్రథమ స్థానంలో ఉన్నది. 60.28 శాతం ఉత్తీర్ణతతో నిజామాబాద్ జిల్లా అట్టడుగున నిలిచింది.



