Sunday, June 29, 2025
E-PAPER
Homeతాజా వార్తలుఈ భూమిలో సాగు చేయొద్దు

ఈ భూమిలో సాగు చేయొద్దు

- Advertisement -

– దళిత కుటుంబంపై కర్రలతో దాడి
– విత్తనాలనూ లాక్కెళ్లిన వైనం
– ఆస్పత్రిపాలైన నలుగురు బాధితులు
– మధ్యప్రదేశ్‌లో కొందరు దుండగుల దుశ్చర్య
భోపాల్‌:
దేశంలో కులవివక్ష, భూమి హక్కులపై కలతపెట్టే మరో ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్నది. తమ భూమిని సాగు చేసుకుంటున్న ఓ అమాయకపు దళిత కుటుంబంపై కొందరు దుండగులు రెచ్చిపోయారు. బాధితులపై కర్రలతో దాడికి దిగారు. మహిళలని కూడా చూడకుండా కొట్టారు. అంతటితో ఆగకుండా ఆ కుటుంబం తీసుకొచ్చిన విత్తనాలను కూడా నిందితులు బలవంతంగా లాక్కెళ్లారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు మహిళలతో పాటు మొత్తం నలుగురు ఆస్పత్రి పాలయ్యారు. బాధితుల కథనం ప్రకారం.. విదిషలోని నారాయణపుర గ్రామంలో ఒక దళిత కుటుంబం తమ వ్యవసాయ భూమిలో విత్తనాలను విత్తుతున్నది. ఇది గమనించిన కొందరు దుండగులు దళిత కుటుంబసభ్యులపై దాడికి దిగారు. ఈ దాడిలో ఇద్దరు మహిళలు కూడా గాయపడ్డారు. అంతటితో ఆగకుండా ఆ కుటుంబం తెచ్చుకున్న సోయాబీన్‌ విత్తనాలనూ నిందితులు లాక్కెళ్లారు. వాటిని తమ వ్యవసాయ భూమిలో విత్తారు. ఈ దాడి ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరు మహిళలూ ఉన్నారు. చికిత్స కోసం వీరిని ప్రభుత్వాస్పత్రిలో చేర్పించారు. దళిత కుటుంబంపై దాడికి సంబంధించిన వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనకు సంబంధించి నెటిజన్లు ఆందోళనను వ్యక్తం చేశారు. ఇది రాజకీయంగానూ తీవ్ర చర్చకు దారి తీసింది.
ఏ కారణమూ లేకుండానే తమను లక్ష్యంగా చేసుకొని నిందితులు దాడికి దిగారని బాధిత కుటుంబం తెలిపింది. ”మేము మా స్వంత భూమిలో సాగు చేస్తున్నాం. ఇంతలో మురారీ, హన్స్‌రాజ్‌, గుడ్డా, పర్వత్‌, బంటిలు వచ్చి, మాపై దాడి చేశారు. మహిళలని కూడా చూడకుండా వారినీ కొట్టారు. మా దగ్గరి నుంచి విత్తనాలను లాక్కెళ్లారు. వారి ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ఆ తర్వాత ఆ విత్తనాలను వారు వారి పొలాల్లో విత్తారు” అని బాధితుడు భగవత్‌సింగ్‌ అహిర్వార్‌ చెప్పారు. ఆ భూమి చట్టబద్ధంగా తమదేననీ, అందులో సాగు చేయకుండా నిందితులు తరచూ ఒత్తిడి చేస్తున్నారని బాధిత కుటుంబం వాపోయింది.

బీజేపీ పాలనలో దళితులపై పెరుగుతున్న దాడులు : కాంగ్రెస్‌
ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామనీ, దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారి రోహిత్‌ కశ్వానీ చెప్పారు. ఇటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ.. మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. రాష్ట్రంలో దళితులపై పెరుగుతున్న దాడులకు ఈ ఘటన ఒక ఉదాహరణ అని ఆందోళన వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌ పార్టీ బాధితులకు అండగా ఉంటుందనీ, నిందితులను వెంటనే అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -