నవతెలంగాణ-హైదరాబాద్: కెనడా ప్రధాని మార్క్ కార్నీ తన క్యాబినెట్ను పునర్వ్యవస్థీకరించారు. కొత్త కేబినెట్లో భారతీయ -కెనడియన్లు అనితా ఆనంద్, మణీందర్ సిద్ధూలు కీలకమైన మంత్రిత్వ శాఖలను పొందారు. మంగళవారం ప్రకటించిన కొత్త కేబినెట్లో అనితా ఆనంద్ విదేశాంగ మంత్రిగా, సిద్ధు అంతర్జాతీయ వాణిజ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్నికలకు ముందు అనితా ఆనంద్ ఆవిష్కరణలు, సైన్స్ మరియు పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. గతంలో రక్షణ మంత్రి సహా పలు పదవులను నిర్వహించారు. ప్రస్తుతం పరిశ్రమల మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మెలానీ జోలీ స్థానంలో ఆమె నియమితులయ్యారు.
కెనడా విదేశాంగ మంత్రిగా నియమితులవడం తనకు గౌరవంగా ఉందని, కెనడియన్లకు సురక్షితమైన, న్యాయమైన దేశాన్ని అందించేందుకు ప్రధాని కార్న్, తమ బృందంతో కలిసి పనిచేసేందుకు ఎదురుచూస్తున్నానని అనితా ఆనంద్ ఎక్స్లో పేర్కొన్నారు. అంతర్జాతీయ వాణిజ్యమంత్రిగా నియమితులవడం జీవితకాల పురస్కారంగా భావిస్తున్నానని ప్రమాణస్వీకారం అనంతరం సిద్ధు ఎక్స్లోపేర్కొన్నారు. వాణిజ్యాన్ని వైవిధ్యపరచడానికి, కొత్త ప్రపంచ మార్కెట్లను చేరుకోవడంలో కెనడియన్ వ్యాపారాలకు మద్దతు ఇవ్వడానికి, ఉపాధి కల్పనలో సహాయపడటానికి తనపై వుంచిన విశ్వాసానికి కృతజ్ఞుడినని పేర్కొన్నారు.
ఏప్రిల్ చివరి వారంలో జరిగిన కెనడా ఎన్నికల్లో లిబరల్ పార్టీ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. కెనడా ప్రధానిగా మార్క్ కార్నీ బాధ్యతలు చేపట్టారు. రెండు వారాల తర్వాత ఆయన కేబినెట్ పునర్వ్యవస్థీకరణను ప్రకటించారు.