నవతెలంగాణ-హైదరాబాద్: పార్లమెంటును మించినది ఏదీ లేదని.. పార్లమెంటే అత్యున్నతమైనదని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. ఇటీవల సుప్రీంకోర్టు రాష్ట్రాల గవర్నర్లు అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను తొక్కిపెట్టడంపైన ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్లు గానీ, రాష్ట్రపతి గానీ శాసనసభ ఆమోదించిన బిల్లులను నిర్దేశ గడువులోపే పరిశీలించి ఆమోదించాలని తీర్పునిచ్చింది. గవర్నర్ రాష్ట్రపతికి బిల్లులని పంపినా.. మూడు నెలలోపే ఆ బిల్లులను క్లియర్ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తమిళనాడుకు చెందిన బిల్లులపై సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ స్పందించారు. పార్లమెంటే సుప్రీం అని..రాష్ట్రపతి విధులకు సంబంధించి ఆదేశాలు ఇచ్చే అధికారం న్యాయవ్యవస్థకు లేదని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా విమర్శలపై మరోసారి ఆయన స్పందించారు. తాను అన్న వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పుకొచ్చారు.
మంగళవారం ఢిల్లీ యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో జగదీప్ ధన్కర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుపై తాను చేసిన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలపై స్పందించారు. రాజ్యాంగ వ్యవస్థ ప్రకారం తాను మాట్లాడిన ప్రతి మాట.. అత్యున్నతమైన జాతి ప్రయోజనాలతో చేసిందే అని అన్నారు. పార్లమెంటే అత్యున్నతమైనది.. న్యాయవస్థ ‘సూపర్ పార్లమెంట్’ పాత్రను పోషించలేదు, కార్యనిర్వాహక వర్గంలోకి ప్రవేశించలేదు అని అన్నారు.
పార్లమెంటును మించినది ఏదీ లేదు: ఉపరాష్ట్రపతి
- Advertisement -
RELATED ARTICLES