Saturday, June 7, 2025
E-PAPER
Homeతాజా వార్తలుప్రభుత్వ ఉద్యోగులు-విశ్రాంత ఉద్యోగులకు రెండు డీఏలు

ప్రభుత్వ ఉద్యోగులు-విశ్రాంత ఉద్యోగులకు రెండు డీఏలు

- Advertisement -

– ఒకటి ఇప్పుడే చెల్లింపు..రెండోది ఆరు నెలల్లో…
– బకాయిలు ప్రతీనెలా చెల్లింపులు
– ఉద్యోగుల కోసం హెల్త్‌ కేర్‌ ట్రస్టు ఏర్పాటు
– సన్నధాన్యం పండించే రైతులకు
– ప్రోత్సాహకాలు..బోనస్‌ కొనసాగింపు
– నర్సింగ్‌ డైరెక్టరేట్‌ ఏర్పాటు : రాష్ట్ర మంత్రివర్గంలో పలు కీలక నిర్ణయాలు
– ఐదున్నర గంటలపాటు సుదీర్ఘ భేటీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్‌ ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీటిలో ఒక డీఏను వెంటనే చెల్లించాలని, రెండో డీఏను మరో ఆరు నెలల్లో చెల్లించాలని నిర్ణయించింది. ఉద్యోగ విరమణ చేసిన వారిని తిరిగి నియమించుకోవద్దంటూ ఆయా సంఘాలు కోరిన నేపథ్యంలో, దానికి ప్రభుత్వం అంగీకరించింది. ఎన్నికల సమయంలో బదిలీ అయిన ఉద్యోగులను తిరిగి వారి పూర్వ స్థానాల్లోకి తీసుకొచ్చేందుకు సర్కారు ఓకే అన్నది. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని సచివాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. ఐదున్నర గంటలపాటు కొనసాగిన క్యాబినెట్‌ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సంబంధిత వివరాలను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాకు వివరించారు. విలేకర్ల సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.
మంత్రివర్గ నిర్ణయాలివే…
– రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు, రిటైర్డ్‌ ఉద్యోగులకు రెండు డీఏలు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
– ఒక డీఏను వెంటనే చెల్లించాలని, రెండో డీఏను మరో ఆరు నెలల్లో చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.
– 2023 జనవరి 1వ తేదీ నుంచి బకాయి ఉన్న డీఏలలో ఒక డీఏను వెంటనే చెల్లిస్తుంది. అప్పటి నుంచి ఇప్పటివరకు బకాయి పడ్డ ఎరియర్స్‌ ను 28 వాయిదాల్లో చెల్లిస్తారు.
– మరో డీఏ ను వచ్చే ఏప్రిల్‌ లో ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది.
– ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల వివరాలను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క క్యాబినెట్‌కు నివేదించారు.
– ఉద్యోగుల డిమాండ్లపై మే 6 వ తేదీన ప్రభుత్వం ఏర్పాటు చేసిన అధికారుల కమిటీ తమ నివేదికను సమర్పించింది.
– ఉద్యోగులు ఇచ్చిన 57 డిమాండ్లను పరిశీలించిన మంత్రివర్గం. అధికారుల కమిటీ నివేదిక ప్రకారం కొన్ని అంశాలను ఆమోదిం చగా, కొన్నింటిని పరిశీలనకు స్వీకరించింది.
– ఉద్యోగులకు సంబంధించిన బకాయిలను ఇకపై ప్రతి నెలా క్రమపద్ధతిలో చెల్లించాలని నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలా రూ.700 కోట్లు వీటికి చెల్లించాలని నిర్ణయం.
– ఉద్యోగుల హెల్త్‌ కార్డులకు సంబంధించి మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగ సంఘాల అభ్యర్థన మేరకు హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. దీనికి సీఎస్‌ చైర్మెన్‌గా వ్యవహరిస్తారు. అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ట్రస్ట్‌లో సభ్యులుగా ఉంటారు. హెల్త్‌ కార్డు కోసం ఉద్యోగులు ప్రతీనెలా రూ.500 చెల్లిస్తే, అంతే మొత్తంలో ప్రభుత్వం కూడా రూ.500 చెల్లించేందుకు నిర్ణయం
– ప్రతి సంవత్సరం సెప్టెంబర్లో డీపీసీ వేయనుంది.
– స్టేట్‌ లెవల్‌ మెడికల్‌ ఇన్వ్యాలిడేషన్‌ కమిటీ ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది.
– జాయింట్‌ స్టేట్‌ కౌన్సిల్‌, మరియు అసోసియే షన్లను రికగ్నిషన్‌ చేసేందుకు ఒప్పుకుంది.
– జీవో 317లో ఇంకా కొన్ని కేటగిరీలను చేర్చాలని నిర్ణయం తీసుకుంది.
– రాష్ట్రంలో నర్సింగ్‌ డైరెక్టరేట్‌ ఏర్పాటుకు ఆమోదం
– అంగన్‌వాడీల రిటైర్‌మెంట్‌ బెనిఫిట్లను రూ.2 లక్షలకు పెంచేందుకు సానుకూల నిర్ణయం
– అద్దె వాహనాల పెండింగ్‌ బిల్లుల క్లియరెన్సుకు అంగీకారం, వాహనాల అద్దెలను పెంచేందుకు నిర్ణయం
– కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఎర్త్‌ సైన్సెస్‌ యూనివర్సిటీకి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన స్వర్గీయ మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ పేరు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది.
– రాష్ట్రంలో సన్న ధాన్యం పండించే రైతులను ప్రోత్సహించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
– సన్నాలకు బోనస్‌ తో రైతులకు లబ్ధి చేకూరిందని, సన్న వడ్లకు బోనస్‌ కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
– స్వయం సహాయక సంఘాలకు ప్రమాద బీమా పథకం అమలుకు రూ. 38.5 కోట్లు స్త్రీనిధికి కేటాయించాలని నిర్ణయం. ఇన్సూరెన్స్‌ కంపెనీలకు ప్రీమియం చెల్లించ కుండా నేరుగా స్త్రీనిధి ద్వారా 385 మంది బాధిత కుటుంబాలకు ప్రమాదబీమా పరిహారం అందించాలని మంత్రివర్గం నిర్ణయం
– రాష్ట్రంలోని అన్ని రోడ్లను అభివృద్ధి చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. హ్యామ్‌ విధానంలో అన్ని నియోజకవర్గాల్లో పంచాయతీరాజ్‌, ఆర్‌ అండ్‌ బీ రోడ్ల అభివృద్ధికి చర్యలు తీసుకునేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.
– పంచాయతీరాజ్‌ పరిధిలో 7947 కిలోమీటర్లు, ఆర్‌ అండ్‌ బీ పరిధిలో 5190 కిలోమీటర్లు.. మొత్తం 13137 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేస్తుంది.
– పంచాయతీ రాజ్‌ రోడ్లకు రూ. 16 వేల 780 కోట్లు, ఆర్‌ అండ్‌ బీ రోడ్లకు రూ. 16 వేల 414 కోట్లు ప్రభుత్వం రాబోయే రోజుల్లో ఖర్చు పెడుతుంది.
– హ్యామ్‌ విధానంలో రెండేండ్లలో నిర్మాణంతో పాటు 15 ఏండ్ల మెయింటెనెన్స్‌ కూడా ఏజెన్సీలదే బాధ్యత ఉంటుంది.
– పార్లమెంట్‌ నియోజకవర్గం ఒక యూనిట్‌గా లేదా ఉమ్మడి జిల్లాల వారీగా ఒక్కో జిల్లా ఒక్కో ప్యాకేజ్‌ గా విభజించి రోడ్ల అభివృద్ధి చేయాలని నిర్ణయం
– గ్రామ పంచాయతీ కార్యదర్శి ర్యాంకుకు సంబంధించి ఉద్యోగుల డిమాండ్‌పై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం
– హైదరాబాద్‌ సిటీలో మెట్రో ఫేజ్‌-2 ప్రాజెక్టుకు 86.1 కిలోమీటర్లకు రూ.19579 కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్‌ వెంచర్‌తో చేపట్టాలని మంత్రివర్గం నిర్ణయించింది.
– కారిడార్‌-1లో శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ నుంచి ఫ్యూచర్‌ సిటీ వరకు 39.6 కి.మీ.
– కారిడార్‌-2 జూబ్లీ బస్‌ స్టేషన్‌ నుంచి మేడ్చల్‌ వరకు 24.5 కి.మీ.
– కారిడార్‌-3 జూబ్లీ బస్‌ స్టేషన్‌ నుంచి శామీర్‌ పేట్‌ వరకు 22 కి.మీ వరకు పొడిగించాలని నిర్ణయం

నిధుల సమీకరణపై దృష్టిపెట్టాలి : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
– రిసోర్స్‌ మొబిలైజేషన్‌
– క్యాబినెట్‌ సబ్‌కమిటీ భేటీ
– వచ్చేవారం మళ్లీ సమీక్ష
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

నిధుల సమీకరణపై అధికారులు తీవ్రంగా దృషి సారించాలని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గురువారం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సచివాలయంలో రిసోర్స్‌ మొబిలైజేషన్‌ క్యాబినెట్‌ సబ్‌కమిటీ సమావేశం భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో సబ్‌కమిటీ సభ్యుడు మంత్రి జూపల్లి కష్ణారావు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రెవెన్యూ రిసోర్స్‌ మొబిలైజేషన్‌ క్యాబినెట్‌ సబ్‌కమిటీ సమావేశం ప్రతివారం జరుగుతుందనీ, ఇందులో తీసుకున్న నిర్ణయాలను వేగంగా అమలు చేయాలని డిప్యూటీ సీఎం అధికారులను ఆదేశించారు. ప్రగతిని వచ్చేవారం అంశాలవారీగా సమీక్షిస్తామని తెలిపారు. తాజాగా రెవెన్యూ రిసోర్స్‌ మొబిలైజేషన్‌కు సంబంధించి వివిధ శాఖల ఉన్నతాధికారులు చెప్పిన అంశాలు, వాటి పురోగతిని నిరంతరం పరిశీలించడానికి ఆర్థిక శాఖలో ప్రత్యేక అధికారిని నియమించాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. సమావేశంలో శాఖల వారీగా అంశాలను ఆయన సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌ కుమార్‌ సుల్తానియా, ఆర్‌అండ్‌బీ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజు, ఎక్సైజ్‌, వాణిజ్యశాఖ ముఖ్యకార్యదర్శి రిజ్వీ, రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, మైనింగ్‌శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్‌, కమిషనర్లు హరిత, హరికిరణ్‌, విష్ణువర్ధన్‌, సురేంద్రమోహన్‌, బుద్ధ ప్రకాశ్‌ జ్యోతి, ఇలంబర్తి, ఆర్‌వి కర్ణన్‌ తదితరులు పాల్గొన్నారు.

ఆకుపచ్చ తెలంగాణ కోసం కృషి చేద్దాం
– ప్రకృతిని కాపాడేందుకు కంకణబద్ధులు కావాలి : సీఎం రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

ఆకుపచ్చ తెలంగాణ కోసం ప్రజలందరూ కృషి చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ఎక్స్‌ వేదిక ద్వారా పిలుపుని చ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మనమందరం ప్రకృతిని కాపాడేందుకు కంకణబద్ధులు కావాలని పేర్కొన్నారు. ‘పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ప్రకృతి రక్షణ, పునరుజ్జీవనం, పునర్వినియోగం, స్థిరత్వం కోసం కృషి చేద్దాం. ఈ క్రమంలో సర్కార్‌ తీసుకుంటున్న కఠినమైన నిర్ణయాలకు సహకరించండి. అందరం కలిసి తెలంగాణను భూమిపై ఆకుపచ్చ, ప్రదేశాలలో ఒకటిగా మార్చడానికి పాటు పడుదాం” అని సీఎం పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -