నవతెలంగాణ – కోల్కతా : శుక్రవారం పశ్చిమబెంగాల్లోని పలు జిల్లాల్లో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలు జరిగాయి. ముర్షిదాబాద్లో జరిగిన నిరసనల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. పది మంది పోలీసులు గాయపడ్డారు. ఈ ఘటనల నేపథ్యంలో ముర్షిదాబాద్లో 110 మందికి పైగా నిరసనకారుల్ని అరెస్టు చేసినట్లు పోలీసులు శనివారం వెల్లడించారు. కాగా, శుక్రవారం వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మాల్డా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో శుక్రవారం పెద్దఎత్తున నిరసనలు జరిగాయి. ఈ నిరసనల్లో భాగంగా నిరసనకారులు నింతిటా రైల్వే స్టేషన్లో ఆగిఉన్న రైలుపై రాళ్లతో దాడి చేశారు. స్టేషన్ ఆస్తిని ధ్వంసం చేశారు. పోలీసు వ్యాన్లతో సహా అనేక వాహనాలకు నిప్పు పెట్టారు. భద్రతా దళాలపై రాళ్లు రువ్వి రోడ్లను దిగ్బంధించారు. ఈ ఘటనల నేపథ్యంలోనే పోలీసులు సుతి నుంచి 70 మందికిపైగా, సంసెర్గంజ్ నుంచి 41 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా శనివారం కూడా నిరసనలు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ నిరసనల వల్ల ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ముర్షిదాబాద్ జిల్లాలో నిషేధిత ఆజ్ఞలు అమల్లో ఉన్నాయని.. ఇంటర్నెట్ సేవలను కూడా నిలిపివేసినట్లు పోలీసులు వెల్లడించారు.