నవతెలంగాణ-హైదరాబాద్: జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి నేపథ్యంలో తమ పర్యటనను ప్రయాణికులు విరమించుకుంటున్నారు. ఈ నెల 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోవడంతో భయాందోళనలు నెలకొన్నాయి. ఇప్పటికే అక్కడకు చేరుకున్న వారంతా ఆక్రందనలతో వెనక్కి వస్తుండడం, మే 5వ తేదీలోపు ఎయిర్ట్రావెల్, కాశ్మీర్లోయలో హోటల్స్, గదులు బుక్ చేసుకున్న వారంతా తమ తమ టికెట్లను రద్దు చేసుకుంటున్నారు. అదే సమయంలో డబ్బులు తిరిగి ఇచ్చేది లేదంటూ కాశ్మీర్లోయ హోటళ్ల యజమానులు తెగేసి చెబుతున్నారు. సమ్మర్ టూరిజం పేరుతో ఆంధ్రప్రదేశ్ తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, ఇతర నగరాలు, పట్టణ ప్రాంతాల నుంచి కాశ్మీర్ లోయకు ప్రయాణం అయ్యేవారు ఢిల్లీ నుంచి శ్రీనగర్కు విమానం టికెట్లు బుక్ చేసుకుంటారు. మే ఐదు నాటికి సుమారు 1500 మంది ప్రయాణికులు ఇలా వెళ్లే వారు ఉన్నారని ఎపి ఎయిర్ ట్రావెలర్స్ అసోసియేషన్ ప్రతినిధి విజరుమోహన్ ‘ప్రజాశక్తి’కి తెలిపారు. ప్రతి ఏటా ఏప్రిల్ నుంచి జూన్ వరకూ ఎనిమిది వేల మంది పర్యాటకులు కాశ్మీర్ లోయకు వెళ్తుంటారని, ఏప్రిల్లో ఈ ఏడాది 1500 మంది, మేలో ఐదు వేలు, జూన్లో 1500 మంది ఇలా సరాసరి ఎయిర్ టికెట్స్ బుక్ చేసుకున్నారని చెప్పారు. మే ఐదు నాటికి వెళ్లాల్సిన వారిలో 1500 మంది రద్దు చేసుకోగా.. మే, జూన్లో టికెట్లు బుక్ చేసుకున్న వారిలో 30 నుంచి 40 శాతం మంది రద్దు చేసుకునే అవకాశముంది.
డబ్బు వాపసు లేదంటున్న హోటల్ యజమానులు
కాశ్మీర్ లోయ అందచందాలను తిలకించేందుకు వెళ్లే పర్యాటకులు సాధారణంగా శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గాం, సొహన్మార్గ్, బూటౌస్లలో హోటళ్లు తీసుకుని పర్యటనలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. పర్యటన రద్దయితే ఆ డబ్బులివ్వబోమంటూ అక్కడి యజమానులు తాజాగా పర్యాటకులకు చెబుతున్నారు. కావాలంటే మరో రెండు నెలల్లో వస్తే అందుకు తగ్గ ఓచర్లు ఇస్తామంటున్నారు.