
నవతెలంగాణ-హైదరాబాద్: అహ్మదాబాద్ ఘోర విమాన ప్రమాదంలో 279మంది చనిపోయిన సంఘటన మరువక ముందే..ఆదివారం దేశవ్యాప్తం వేర్వేరు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఆ ఘోర ప్రమాదాల్లో సుమారు 21మంది చనిపోయారు. మహారాష్ట్ర పుణే జిల్లాలో పింప్రి-చించ్వాడ్ పీఎస్ పరిధిలోని కుందమలలో ఇంద్రయాణి నదిపై వంతెన కూలిపోయింది. ఈ ఘటనలో 20 నుంచి 25 మంది వరకు గల్లంతయ్యారు. ఇప్పటి వరకు ప్రమాదంలో ఆరుగురు మరణించినట్లుగా స్థానిక ఎమ్మెల్యే సునీల్ షుల్కే తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం సమయంలో వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ప్రస్తుతం గల్లంతయ్య వారి కోసం గాలిస్తున్నారు.
మరో ఘోర ప్రమాదం..కుప్పకూలిన హెలికాప్టర్

ఆదివారం ఉదయం గుప్తకాశీ నుంచి కేదార్నాథ్ కు వచ్చిన హెలికాప్టర్ తిరిగివెళ్తూ కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలెట్ సహా హెలికాప్టర్లో ఉన్న ఏడుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అధికారులు రెండు రోజులపాటు చార్ధామ్ యాత్రకు హెలికాప్టర్ సర్వీసులను రద్దు చేయాలని నిర్ణయించారు.

ఉత్తరాఖండ్లోని సోన్ప్రయాగ్ నుండి కేదార్నాథ్ ధామ్కు వెళ్లే మార్గంలో అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఒకరు చనిపోగా..ఇద్దరికి గాయాలైయ్యాయి. బాధితులను వెంటనే క్యాంప్ ఆస్పత్రికి తరలించింది విపత్తు దళం. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకొని..భారీ వర్షాలు కురవడంతో.. జంగల్చట్టి సమీపంలో ఆకస్మాత్తుగా శిథిలాలు, రాళ్లు లోయలో పడ్డాయని అధికారులు చెప్పారు.
బాసరలో విషాదం.. నదిలో మునిగి నలుగురు మృతి

నిర్మల్ జిల్లాలోని బాసర క్షేత్రం వద్ద ఆదివారం ఉదయం ఈ విషాదం చోటుచేసుకుంది. బాసర సరస్వతీ దర్శనానికి వెళ్లిన భక్తులు ప్రమాదవశాత్తూ గోదావరి నదిలో మునిగిపోయారు. స్నానం కోసం నదిలో దిగిన ఐదుగురు గల్లంతయ్యారు. రాకేశ్, వినోద్, మదన్, రుతిక్, భరత్ ఐదుగురి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. మృతులంతా హైదరాబాద్ లోని దిల్ సుఖ్ నగర్ వాసులని, అందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ లో ఘోరం…హైటెన్షన్ వైర్లు తెగిపడి ఇద్దరు సజీవదహనం

రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ఎల్బీనగర్లో ఆదివారం తెల్లవారుజామున ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. సాగర్ రింగ్ రోడ్ వద్ద హైటెన్షన్ విద్యుత్ తీగలు తెగిపడి రోడ్డుపై పడిపోవడంతో ఇద్దరు బిక్షాటన చేసే వ్యక్తులు సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో ఓ వీధికుక్క అక్కడికక్కడే ఆహుతి అయింది.సమాచారం అందుకున్న ఎల్బీనగర్ పోలీసులు, వెంటనే విద్యుత్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే కరెంట్ నిలిపివేయడంతో భారీ ప్రమాదం తప్పింది.