నవతెలంగాణ-హైదరాబాద్: సింహాచలం దుర్ఘటనలో … మరణించినవారి కుటుంబాలకు ఒక కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని, ప్రమాదానికి కారణమైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ(యం) డిమాండ్ చేసింది. దీనికి సంబంధించి బుధవారం సీపీఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఓ ప్రకటనను విడుదల చేశారు. విశాఖ జిల్లా సింహాచలం దేవస్థానంలో ఈ రోజు జరిగిన చందనోత్సవం సందర్భంగా జరిగిన దుర్ఘటనలో గోడకూలి ఏడుగురు యాత్రికులు మరణించడం పట్ల సీపీఐ(యం) దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నదని, వారికి సీపీఐ(యం) రాష్ట్ర కమిటీ సంతాపం తెలియజేస్తున్నదన్నారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తున్నదని అన్నారు. చనిపోయినవారిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందినవారు కూడా ఉన్నారని తెలిపారు. చనిపోయినవారు ఒక్కొక్కరు చొప్పున వారి కుటుంబాలకు ఒక కోటి రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని, గాయపడినవారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. గాయపడిన స్థితిని బట్టి రూ.10 లక్షల వరకూ నష్ట పరిహారం అందించాలని కోరారు. ఈ ప్రమాదానికి కారణమైన గోడ కట్టి కొద్దికాలమే అయినప్పటికీ కూలటం అంటే నాణ్యత లేదని స్పష్టంగా అర్ధమవుతున్నదన్నారు. గోడకట్టిన కాంట్రాక్టరు, పర్యవేక్షించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఐ(యం) డిమాండ్ చేస్తున్నదని శ్రీనివాసరావు పేర్కొన్నారు.
సింహాచలం మృతుల కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారమివ్వాలి : CPI(M)
- Advertisement -
RELATED ARTICLES