– వైఫల్యాలుంటే సరిదిద్దుకోండి : కలెక్టర్లకు సీఎం రేవంత్రెడ్డి దిశానిర్దేశం
– వ్యవసాయ ప్రణాళికకు అనుగుణంగా చర్యలు తీసుకోండి
– రైతులకు విత్తనాలు, ఎరువులు సకాలంలో అందించాలి
– నకిలీ విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్
– భూభారతి చట్టాన్ని ప్రజలకు చేరువ చేయండి
– ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో జాప్యం తగదు
– వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల జాగ్రత్త వహించండి
– రాష్ట్రంలో 90 శాతం ధాన్యం సేకరణ పూర్తి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
”కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలి. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం చేయొద్దు. వైఫల్యాలుంటే సరిదిద్దుకోవాలి. కావాలని ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే వెంటనే వివరణ ఇవ్వండి. చిన్న చిన్న సమస్యలుంటే తక్షణమే పరిష్కరించండి. ఒక్క నిమిషం వృధా చేయొద్దు.. నిర్లక్ష్యం వహించొద్దు. అవసరమైతే లోకల్ గోడౌన్లను లీజుకు తీసుకోండి. మిల్లర్లు, దళారులు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోండి” అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ధాన్యం సేకరణ, ఇందిరమ్మ ఇండ్లు, భూ భారతి, రుతుపవనాలు, వానాకాలం పంటల సాగు అంశాలపై మంగళవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వానలు ముందుగా రావడం వల్ల కొన్ని చోట్ల ధాన్యం సేకరణకు ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. చివరి గింజ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం భరోసా ఇచ్చారు. ధాన్యం సేకరణను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. అవసరమైతే స్థానికంగా గోదాములు అద్దెకు తీసుకోవాలని సూచించారు. ఎక్కడైనా మిల్లర్లు, దళారులు రైతులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
”’యాసంగిలో గతేడాది 42 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొంటే, ఈసారి 64.50 లక్షల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 90శాతం ధాన్యం సేకరణ పూర్తయింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 48 గంటల్లో రైతులకు ధాన్యం డబ్బులు చెల్లిస్తున్నాం. ఈ సీజన్లో ఇప్పటికే రూ.12,184 కోట్లు చెల్లించాం” అని సీఎం వివరించారు. అధికారులు, జిల్లాల్లో కలెక్టర్లు సమర్థవంతంగా పని చేయటం వల్లనే ప్రభుత్వం ఈ విజయం సాధించిందని వారిని అభినందించారు. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో ఈ ఏడాది 2.75 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి సాధించటం, రైతులు సాధించిన విజయమని సీఎం అన్నారు. 21 జిల్లాల్లో ధాన్యం సేకరణ విజయవంతంగా సాగగా, 12 జిల్లాల్లో అక్కడక్కడ ఆందోళనలు జరిగినట్టు తమ దృష్టికి వచ్చిందని చెప్పారు. కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళితే ఈ సమస్యలన్నీ అక్కడికక్కడే పరిష్కారమవుతాయని సీఎం అన్నారు. చేసిన మంచి పనిని చెప్పుకోకపోవడం వల్లే చిన్న చిన్న సంఘటనలు పెద్దగా ప్రచారంలోకి వస్తున్నాయనీ, కొన్నిచోట్ల రాజకీయ ప్రేరేపిత ఆందోళనలు జరుగుతున్నాయని గుర్తు చేశారు. అనారోగ్యంతో రైతు చనిపోతే ధాన్యం కొనుగోలు వల్లనే అని దుష్ప్రచారం చేసిన ఘటనను ఉదాహరించారు. అందుకే కలెక్టర్లు ఎప్పటికప్పుడు ధాన్యం కొనుగోలు వివరాలను దాచిపెట్టకుండా వెల్లడించాలని ఆదేశించారు. ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వంపై విష ప్రచారం చేసే వారిపై కేసులు పెట్టేందుకు వెనుకాడ వద్దని సూచించారు.
వ్యవసాయ ప్రణాళికకు అనుగుణంగా రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. వాటిని బ్లాక్ మార్కెట్ చేసే వారిపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. నకిలీ విత్తనాలు అమ్మి రైతులను మోసం చేసే వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేయడంతో పాటు నేర చరిత్ర ఉన్న వారిపై పీడీ యాక్ట్ పెట్టాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తెచ్చిన భూభారతి చట్టాన్ని ప్రజలకు చేరువ చేయాలని ఆదేశించారు. ఇప్పటికే ఎంపిక చేసిన మండలాల్లో విజయవంతంగా అమలవుతున్న ఈ చట్టాన్ని త్వరలోనే రాష్ట్రమంతటా అమలు చేస్తామని చెప్పారు. జూన్ మూడు నుంచి 20 వరకు రాష్ట్రమంతటా నిర్వహించే మూడో దశ రెవెన్యూ సదస్సులకు ఇన్చార్జి మంత్రులు షెడ్యుల్ రూపొందించుకోవాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నిర్లక్ష్యం వద్దని సీఎం కలెక్టర్లకు సూచించారు. ఈ నెలాఖరులోగా లబ్దిదారుల తుది జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. తహసీల్దార్, ఎంపీడీవో, కార్మిక అధికారి, స్వయం సహాయక సంఘం సభ్యులతో మండల స్థాయిలో ధరల నియంత్రణ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. మేస్త్రీల చార్జీలు, స్టోన్ మెటల్ వంటి ధరలను కట్టడి చేసే బాధ్యతను ఈ కమిటీకి అప్పగించాలని ఆదేశించారు. ఇసుక దందాతో లబ్దిదారులు ఇబ్బంది పడకుండా ఉచిత కూపన్లను సకాలంలో అందించాలని పేర్కొన్నారు. ఇండ్ల నిర్మాణ పురోగతిని ఎప్పటికప్పుడు యాప్లో నమోదు చేయాలని ఆదేశించారు. ముందుగా వచ్చిన వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు, జ్వరాలు ప్రబలే ప్రమాదముంటుందని సీఎం వైద్యారోగ్య శాఖను అప్రమత్తం చేశారు. ఏజెన్సీ ఏరియాలు, అటవీ ప్రాంతాలున్న జిల్లాల కలెక్టర్లు ప్రజారోగ్యంపై దృష్టి సారించాలని సూచించారు. పొరుగు రాష్ట్రాల్లో కొవిడ్ కేసులు కూడా నమోదవుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ఎలాంటి నష్టం వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీస్, హైడ్రా, ట్రాఫిక్, విద్యుత్ విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. లోతట్టు
ప్రాంతాలు జలమయం కాకుండా, ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని అన్నారు. ఈ నెల 29, 30 తేదీల్లో ఇన్చార్జి మంత్రులు సంబంధిత జిల్లాల్లో పర్యటించాలని రేవంత్ సూచించారు. ధాన్యం సేకరణ, భూభారతి రెవెన్యూ సదస్సులు, వానాకాలం పంటల సాగు సన్నద్ధ ప్రణాళికపై కలెక్టర్లతో సమీక్ష నిర్వహించాలని చెప్పారు. జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. జూన్ 1 నాటికి జిల్లాల వారీగా ఈ అంశాలన్నింటితో పూర్తి నివేదికను అందించాలని మంత్రులకు, కలెక్టర్లకు సీఎం సూచించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్రెడ్డి, దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, సీతక్క, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో పాటు అన్ని జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
అధికారులూ జాగ్రత్త
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES