ప్రభుత్వ బడులను ప్రజలే కాపాడుకోవాలి: మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
నవతెలంగాణ-నల్లగొండ ప్రాంతీయ ప్రతినిధి
ప్రభుత్వ పాఠశాలలను ప్రజలే కాపాడుకోవాలని మాజీ ఎమ్మెల్సీ, టీపీఎస్వీ రాష్ట్ర అధ్యక్షులు అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. తెలంగాణ పౌర స్పందన వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు జరగనున్న ప్రచార జాతా సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని క్లాక్ టవర్ సెంటర్ నుంచి ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగిన ఈ గడ్డ నుండే ప్రచార జాతాను ప్రారంభిస్తున్నట్టు చెప్పారు. అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా విద్యారంగం 90శాతానికిపైగా ప్రభుత్వ ఆధీనంలోనే ఉందని, మన రాష్ట్రంలో మాత్రం 40 శాతమే ప్రభుత్వ ఆధీనంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల చదువులో రోజురోజుకు అంతరాలు పెరిగిపోతున్నాయన్నారు. అంతరాలు లేని నాణ్యమైన చదువు అందరికీ సమానంగా అందాలంటే పాఠశాలలను రీఆర్గనైజ్ చేయాలన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి చైర్మెన్గా, మరో ముగ్గురు సభ్యులతో నియమించిన తెలంగాణ విద్యా కమిషన్ రిపోర్టు సూచించిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. బడీడు పిల్లల సంఖ్య ఆధారంగా గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలని రీఆర్గనైజ్ చేయాలన్నారు. ఇతర ఆవాసాల నుంచి బడికి రావాల్సిన విద్యార్థుల కోసం ఉచిత బస్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. నల్లగొండ లాంటి పట్టణాలలో నూతనంగా ఏర్పడిన వెంకటేశ్వర కాలనీ, శివాజీ నగర్, గాంధీనగర్ లాంటి ప్రాంతాల్లో కొత్త బడులు ఏర్పాటు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో విద్యకు 10శాతం కేటాయించాలని, తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ప్రీ ప్రైమరీ తరగతుల ఏర్పాటుకు కేంద్రం రూ.500 కోట్లు ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలని కోరారు. క్రమంగా అంతరాలు లేని బడులను అభివృద్ధి చేసి ఉన్నోడి పిల్లలయినా లేనోడి పిల్లలయినా ఒకే బడిలో, ఒకే తరగతి గదిలో చదువుకునే పరిస్థితులు కల్పించాలన్నారు. ఈ ప్రచార జాతాను టీఎస్యూటీఎఫ్ ఎం.రాజశేఖర్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పౌర స్పందన వేదిక నల్లగొండ జిల్లా అధ్యక్షులు పాల్వాయి అంజిరెడ్డి, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు ధనమూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు మంగ, నాగమణి, టీఎస్యూటీఎఫ్ నల్లగొండ జిల్లా అధ్యక్షులు బక్క శ్రీనివాసాచారి, ప్రధాన కార్యదర్శి పెరుమాళ్ళ వెంకటేశం, టాప్రా జిల్లా అధ్యక్షులు జగదీష్ చంద్ర, కార్యదర్శి శ్యాంసుందర్, డీవైఎఫ్ఐ అధ్యక్షులు మహేష్, టీఎస్ యుటీఎఫ్ నాయకులు యడ్ల సైదులు, నర్రా శేఖర్రెడ్డి, గేర నరసింహ, నలపరాజు వెంకన్న, పగిళ్ళ సైదులు, కొమర్రాజు సైదులు, మురలయ్య పాల్గొన్నారు.
కేంద్ర బడ్జెట్లో విద్యకు 10శాతం కేటాయించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES