నవతెలంగాణ-హైదరాబాద్: రష్యాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బెదిరింపులకు దిగారు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించకుంటే 100శాతం సుంకాలను ఎదుర్కోవాల్సి వుంటుందని రష్యాను బెదిరించారు. సోమవారం నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టేతో సమావేశంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. 50 రోజుల్లోగా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని లేదా కొత్త ఆర్థిక ఆంక్షలను ఎదుర్కోవాల్సి వుంటుందని అన్నారు. నాటో దేశాల నుండి ఉక్రెయిన్కు కొత్త ఆయుధాలను పంపిణీ చేసేందుకు ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ పట్ల తాను చాలా అసంతృప్తితో ఉన్నానని అన్నారు. యుద్ధం ముగించడానికి పుతిన్ నిరాకరించడతో తనకు సహనం నశించిందని చెప్పారు.
”50 రోజుల్లో ఒప్పందం కుదరకపోతే కఠినమైన సుంకాలను విధిస్తాము. సుమారు 100శాతం వరకు సుంకాలు ఉండవచ్చు” అని అన్నారు. నాటో అమెరికాల మధ్య ఒప్పందం కూడా కుదిరినట్లు ట్రంప్, రుట్టేలు ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం.. నాటో సైనిక కూటమి అమెరికా నుండి పేట్రియాట్ క్షిపణి నిరోధక బ్యాటరీలతో సహా బిలియన్ డాలర్ల ఆయుధాలను కొనుగోలు చేయనుంది. అనంతరం వాటిని ఉక్రెయిన్కు పంపనుంది.
ఇది చాలా పెద్ద ఒప్పందమని నాటో చీఫ్ రుట్టే ప్రశంసలు కురిపించారు. జర్మనీ, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్ మరియు బ్రిటన్ ఉక్రెయిన్కు సాయం అందించే కొనుగోలుదారులుగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
తాను ట్రంప్తో మాట్లాడానని, ఈ ఆయుధ ఒప్పందానికి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు.