నవతెలంగాణ-హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పరీక్షల విధానాన్ని సవాలు చేస్తూ, ఓ 11 ఏళ్ల బాలుడు ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఢిల్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోని సీఎం శ్రీ పాఠశాలల్లో 6, 7, 8 తరగతుల్లో ప్రవేశాలకు ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ పరీక్షలు ఉచిత, నిర్బంధ విద్యాహక్కు చట్టం-2009 స్ఫూర్తికి విరుద్ధమని జన్మేశ్ తన పిటిషన్లో స్పష్టం చేశాడు. తాను 2025-26 విద్యా సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్నానని, జులై 23న ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ మేరకు సెప్టెంబర్ 13న పరీక్ష కూడా రాశానని తెలిపాడు. ఈ ప్రవేశ పరీక్షల విధానం వల్ల పేద, వెనుకబడిన వర్గాల విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ను తక్షణమే రద్దు చేసి, పరీక్షలకు బదులుగా లాటరీ పద్ధతిలో ప్రవేశాలు కల్పించాలని కోరాడు.
కాగా, ఇటీవల ఢిల్లీలో భారీగా స్కూల్స్ ఫీజులు పెరిగిన విషయం తెలిసిందే. ఈ స్కూల్ ఫీజులను ఒక్కసారిగా పెంచడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా స్కూల్ ఎదుట బైఠాయించి నిరసనలు వ్యక్తం చేశారు. రేఖాగుప్తా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు రోజులు ఆందోళనలు మిన్నంటాయి. దీంతో తల్లిదండ్రుల డిమాండ్లకు తలొగ్గి అనధికారంగా ఫీజులు పెంచిన పాఠశాలలపై తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొంది. కానీ బీజేపీ ప్రభుత్వాన్ని ఆయా పాఠశాలలు బేఖాతరు చేశాయని..సుప్రీంకోర్టులో పదకొండేండ్ల బాలుడు వేసిన పిటిషన్ ద్వారా తెటతేల్లమవుతుంది.