– దేశవ్యాప్తంగా 53,651 మంది చిన్నారులు
– తర్వాతి స్థానాల్లో బీహార్, రాజస్తాన్, యూపీ, ఢిల్లీ
– స్పా, మసాజ్, ఆర్కెస్ట్రా సెంటర్లలోనే బాల కార్మికులు ఎక్కువ : సీ ల్యాబ్ నివేదిక వెల్లడి
తెలంగాణలో 2024-25లోనే అక్షరాలా 11,063 బాలకార్మికులకు విముక్తి లభించింది. దేశవ్యాప్తంగా చూసుకుంటే 53,651 చిన్నారుల సంకెళ్లు తెంచబడ్డాయి. జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ (జేఆర్సీ) అనే నెట్వర్క్ 24 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో నిర్వహించిన 38,388 చర్యల్లో 7,632 సహాయక చర్యలకు నాయకత్వం వహించింది. చట్టాన్ని అమలు చేసే సంస్థల సమన్వయంతో జేఆర్సీ భాగ్యస్వాములు ఈ ఆపరేషన్లు నిర్వహించారు. రక్షించబడిన పిల్లల్లో 90 శాతం మంది స్పా, మసాజ్ సెంటర్లు, ఆర్కెస్ట్రా బృందాల్లో పనిచేస్తున్నవారే కావడం గమనార్హం. అక్కడ పిల్లలు లైంగికదాడులకు గురవుతున్నట్టు నివేదిక ఎత్తిచూపింది. జేఆర్సీ భాగస్వామి ఇండియా చైల్డ్ ప్రొటెక్షన్ రీసెర్చ్ విభాగమైన సెంటర్ ఫర్ లీగల్ యాక్షన్ అండ్ బిహేవియర్ ఛేంజ్ (సీ-ల్యాబ్) ప్రచురించిన ‘బిల్డింగ్ ది కేస్ ఫర్ జీరో: ప్రాసిక్యూషన్ బాలకార్మిక వ్యవస్థను అంతమొందించడానికి టిప్పింగ్ పాయింట్గా ఎలా పనిచేస్తుంది’ అనే నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దాడుల అనంతరం 38,388 ఎఫ్ఐఆర్లు నమోదు చేసి 5,809 మందిని అరెస్టు చేయించామనీ, అందులో 85 శాతం బాలకార్మిక వ్యవస్థకు సంబంధించినవేనని నివేదిక పేర్కొంది. అత్యధికంగా జరిగిన దాడుల్లో తెలంగాణ అగ్రస్థానంలో నిలవగా, ఉత్తరప్రదేశ్ (2,469), రాజస్థాన్ (2,453), మధ్యప్రదేశ్ (2,335) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. సహాయక చర్యల్లో తెలంగాణ 11,063 మంది, బీహార్ 3,974, రాజస్థాన్ 3,847, ఉత్తరప్రదేశ్ 3,804, ఢిల్లీ 2,588 మంది చిన్నారులను రక్షించాయి. మొత్తం 5,809 మందిని అరెస్టు చేయగా వారిలో 85 శాతం మంది బాలకార్మిక సంబంధిత కేసుల్లో ఉన్నారు. తెలంగాణ, బీహార్, రాజస్థాన్ లో అత్యధిక అరెస్టులు నమోదయ్యాయి. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో రెస్క్యూ సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ తక్కువ అరెస్టులు జరిగాయి. పరిస్థితి తీవ్రత దృష్ట్యా బాలకార్మిక వ్యవస్థను అంతమొందించేందుకు జాతీయ మిషన్ను ప్రారంభించాలనీ, దానికి తగిన వనరులను కేటాయించాలనీ, జిల్లా స్థాయి బాలకార్మిక టాస్క్ ఫోర్స్లను ఏర్పాటు చేయాలని నివేదిక సిఫార్సు చేసింది. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టపరమైన చర్యలు, విద్య, పునరావాసం వంటి అంశాలను ఈ నివేదిక నొక్కిచెప్పింది. నేరస్థులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోకపోతే బాలకార్మిక వ్యవస్థను అరికట్టడం కష్టమవుతుందని స్పష్టం చేసింది. రక్షించిన పిల్లలకు విద్య, పునరావాసం కల్పించకపోతే వారు తిరిగి బాలకార్మికుల విషవలయంలో పడిపోతారని హెచ్చరించింది. 18 ఏండ్ల వరకు ఉచిత, నిర్బంధ విద్యను నిర్ధారించడం బాలకార్మిక వ్యవస్థను నివారించడంలో సహాయపడుతుందని చెప్పింది. బాలకార్మికుల వినియోగంపై జీరో టాలరెన్స్ విధానం, ప్రమాదకర పరిశ్రమల జాబితా విస్తరణ, రాష్ట్ర నిర్దిష్ట బాలకార్మిక విధానాలు, ఎస్డిజి 8.7 గడువును 2030 వరకు పొడిగించడం, నేరస్తులపై కఠినమైన, కాలపరిమితితో కూడిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నివేదిక డిమాండ్ చేసింది.
సమగ్ర పునరావాస విధానం, ప్రత్యేక నిధి అవసరం
బాల కార్మికులకు పునరావాసం కల్పించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి. ప్రత్యేక విధానాన్ని రూపొందించాలి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పౌర సమాజం కృషి చేసినప్పటికీ ఆశించిన ఫలాలు రావట్లేదు. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించాలన్న సంకల్పం అసంపూర్తిగా మిగిలిపోయింది. బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు కట్టుబడి ఉన్న ఐఎల్ వో కన్వెన్షన్ 182పై భారత్ సంతకం చేసింది. ఈ దిశగా భారత్ చిత్తశుద్ధితో ప్రయత్నాలు చేస్తోంది. అత్యంత దారుణమైన పరిస్థితుల్లో చిక్కుకున్న చిన్నారులకు న్యాయం చేసేలా తమ సంస్థ పనిచేస్తున్నది. దోషులను కఠినంగా శిక్షించి, బాధితుల రక్షణ, పునరావాసం కోసం పటిష్టమైన యంత్రాంగాలను ఏర్పాటు చేసినప్పుడే బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన సాధ్యమవుతుంది.
– జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ నేషనల్ కన్వీనర్ రవికాంత్
రాష్ట్రంలో 11,063 మంది బాలకార్మికులకు విముక్తి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES