నవతెలంగాణ-హైదరాబాద్: ఇజ్రాయిల్ అమానుష దాడుల్లో 120మంది మరణించినట్లు పాలస్తీనియన్ బృందం వెల్లడించింది. గురువారం తెల్లవారుజాము నుండి ఇజ్రాయిల్ జరిపిన బాంబు దాడుల్లో మరణించిన వారి సంఖ్య 120కి పెరిగిందని గాజా పౌర రక్షణ సంస్థ తెలిపింది. ఈ నెలాఖరు నాటికి సాయాన్ని ప్రారంభించనున్నట్లు అమెరికా మద్దతు గల ఎన్జిఒ తెలిపింది. మార్చి 2 నుండి ఇజ్రాయిల్ గాజాకు సాయాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. యుద్ధంలో దెబ్బతిన్న భూభాగానికి మానవతా సాయాన్ని పునరుద్ధరించడం చర్చల ”కనీస అవసరం” కావాలని ఆ బృందం పట్టుబట్టింది.
ఆహారం, నీరు, ఇంధనం మరియపు మందులు వంటి నిత్యావసరాలు కనిష్టస్థాయికి చేరుకున్నాయని గత కొన్ని వారాలుగా ఐక్యరాజ్యసమితి ఏజన్సీలు హెచ్చరిస్తున్నాయి. మంగళవారం ఇజ్రాయిల్ దాడి తర్వాత గాజాలో కాన్సర్ మరియు గుండె సంరక్షణ అందించే చివరి ఆస్పత్రి పనిచేయడం ఆగిపోయిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఒ) తెలిపింది. మానవాళిలో మిగిలిన వారిని ఇజ్రాయిల్ చంపుతోంది అని పాలస్తీనాకి ఐరాస ప్రత్యేక నివేదికురాలు ప్రాన్సిస్కా ఆల్బనీస్ వ్యాఖ్యానించారు. డెయిర్ అల్-బలాపై జరిగిన దాడి అనంతరం ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఇక దాడులు చాలని, యుద్ధం ముగియాలని తాము ప్రార్థిస్తున్నామని స్థానిక వ్యక్తి పేర్కొన్నారు. అన్ని అంతర్జాతీయ సంస్థలు యుద్ధాన్ని ముగించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు.
గాజాలోకి సాయం ప్రవేశించడం అనుకూలమైన మరియు నిర్మాణాత్మక చర్చలకు కనీస అవసరమని హమాస్ సీనియర్ అధికారి బాసెం నయూమ్ పేర్కొన్నారు. ఆహారం, నీరు మరియు మందులను పొందడం ప్రాథమిక హక్కు, చర్చలకు సంబంధించిన అంశం కాదని తీవ్రంగా ధ్వజమెత్తారు.