నవతెలంగాణ-హైదరాబాద్: ఈక్వెడార్లో ఎస్మెరాల్డాస్ ప్రావిన్స్లోని జైలులో లాస్ టిగ్యురోన్స్ అనే క్రిమినల్ ముఠా మరొక గ్రూపుపై జరిగిన ఘర్షణల కారణంగా 17 మంది ఖైదీలు మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం జరిగింది. లాస్ టిగ్యురోన్స్ అనే ముఠా.. లాస్ టోబోస్, లాస్ చోనెరోస్ అనే గ్రూపు సభ్యులు జైళ్లలో లేకుండా చేయడానికే ఆ గ్రూపు ఖైదీలు మిగతా ఖైదీలపై ఘర్షణలకు దిగారు. ఈ ఘర్షణల్లో 17 మంది దారుణంగా హత్యకు గురయ్యారు. ఈ ఘటనతో ఈక్వెడార్ ఆర్మీ, భద్రతా బలగాలు రంగంలోకి దిగి పరిస్థితి అదుపులోకి తెచ్చాయి. ఇక ఈ ఘటనపై అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు.
కాగా, దక్షిణ ఈక్వెడార్లో ఉన్న మచాలా జైలులో కూడా తాజాగా ఇలాంటి ఘటన జరిగింది. అప్పుడు ఖైదీలు 14మంది చనిపోయారు. మచాలా జైలు ఘటన జరిగి మూడు రోజులు కాకముందే.. మరో ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. గత ఐదేళ్లుగా జైళ్లలోని ఖైదీలే ఈక్వెడార్లో మారణహోమాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అవినీతి, అసమర్థ పాలన వల్ల జైళ్లు వ్యాపార కేంద్రాలుగా మారాయి. మాఫియాలకు అడ్డాగా మారాయి. బహుళ మిలియన్ డాలర్ల అక్రమ వ్యాపారాలు జైళ్ల నుంచే సాగుతున్నాయి. అంతర్జాతీయ కొకైన్ వ్యాపారం ఇక్కడి ప్రముఖ జైళ్ల నుంచే సాగతుంది. మాఫియా గ్రూపులు జైళ్ల నుంచే తమ వ్యాపారాన్ని సాగిస్తున్నాయి