– 189 మృతదేహాల అప్పగింత
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన వారం రోజుల తరువాత మృతుల్లో 211 మందిని డిఎన్ఎ టెస్టుల ద్వారా గుర్తించారు. వీరిలో 189 మంది మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ విషయాన్ని అధికారులు గురువారం వెల్లడించారు. ఈ నెల 12న 242 మంది ప్రయాణీకులు, సిబ్బందితో అహ్మదాబాద్ నుంచి లండన్కు బయలుదేరిన ఎయిర్ ఇండియా 171 విమానం టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలిపోయిన సంగతి తెలిసిందే. ఒక్కరు మినహా విమానంలో ఉన్న అందరూ మరణించారు. మృతుల గుర్తింపును నిర్ధారించడానికి డిఎన్ఎ పరీక్షలను అధికారులు నిర్వహిస్తున్నారు. విమాన ప్రమాదం కారణంగా మృతదేహాలు కాలిపోవడం, గుర్తించలేని విధంగా తీవ్రంగా దెబ్బతినడంతో మరణించిన వారిని గుర్తించడానికి డిఎన్ఎ పరీక్షలు తప్ప మరో మార్గం లేదని అధికారులు తెలిపారు. ‘గురువారం ఉదయం వరకూ 211 డిఎన్ఎ నమూనాలు సరిపోయాయి. 189 మృతదేహాలను సంబంధిత కుటుంబాలకు అప్పగించాం’ అని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రాకేష్ జోషి విలేకరులకు తెలిపారు. అప్పగించిన 189 మంది మృతుల్లో 142 మంది భారతీయులు, 32 మంది బ్రిటీష్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్ దేశస్థులు, ఒక కెనడియన్ ఉన్నారు.
అహ్మదాబాద్ విమాన ప్రమాద మృతుల్లో 211 మంది గుర్తింపు
- Advertisement -
- Advertisement -