- Advertisement -
- – ఫీజు నియంత్రణ ఉండాలి
– గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ధర్మనాయక్
నవతెలంగాణ-చంపాపేట్
విద్యా హక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు ప్రయివేట్ స్కూల్స్లో 25% ఫ్రీ సీట్లు ఇవ్వాలని తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం.ధర్మనాయక్ అన్నారు. తెలంగాణ గిరిజన సంఘం హైదరాబాద్ సౌత్ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2009 సంవత్సరంలో విద్యాహక్కు చట్టం ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వరకు ఉన్నటువంటి పేద విద్యార్థులకు ప్రయివేట్ స్కూళ్లలో 25% ఫ్రీ సీట్లు ఇవ్వాలని చట్టం చెబుతున్నది అయినా ప్రయివేట్ యాజమాన్యాలు పట్టించుకోవడం లేదన్నారు. పేద విద్యార్థులకు విద్యను దూరం చేసే విధంగా ఫీజులు అధికంగా పెంచుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం తక్షణమే ప్రయివేట్ యాజమాన్యాలతో మాట్లాడి పేద విద్యార్థులకు విద్యను అందించే విధంగా ఫ్రీ సీట్లు ఇవ్వాలని కోరారు. ప్రయివేట్ స్కూళ్లలో బుక్స్, స్కూల్ డ్రెస్, ష్స్ పేర్లతో విపరీతమైన దోపిడీని కొనసాగిస్తున్నా రని, ప్రయివేట్ యాజమాన్యాలు చెప్పిందే వేదమైనట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాదులో ఉన్నటువంటి ప్రయివేట్ స్కూళ్ల మీద పర్యవేక్షణ చేస్తూ సమీక్షించి పేద విద్యార్థులకు విద్యను అందే విధంగా ఫీజులు కట్టుకునే వీలును కల్పించే విధంగా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలన్నారు. పేద విద్యార్థులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 25% ఫ్రీ సీట్లు కేటాయించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆయన వెంట జిల్లా అధ్యక్షులు వి. రామ్కుమార్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.బాలు నాయక్ తదితరులు ఉన్నారు.
- Advertisement -