నవతెలంగాణ ఢిల్లీ: న్యూఇయర్ వేడుకల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు భారీ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. భారీఎత్తున డ్రగ్స్తో పాటు 40కి పైగా ఆయుధాలను ఈ ఆపరేషన్ లో స్వాధీనం చేసుకొన్నారు. ఈనేపథ్యంలో 285 మందిని అదుపులోకి తీసుకున్నారు.
‘ఆపరేషన్ ఆఘాత్ 3.0’ పేరిట ఆగ్నేయ ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో పోలీసులు అర్ధరాత్రి వేళ తనిఖీలు నిర్వహించారు. వీధి రౌడీలు, నేరస్థులతో సంబంధం ఉన్న అనుమానితులే లక్ష్యంగా తనిఖీలు చేశారు. కొత్త ఏడాది వేడుకల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యల్లో భాగంగా దీన్ని నిర్వహించినట్లు పోలీసులు తెలిపారు.
ఆపరేషన్లో భాగంగా దాదాపు 285 మందిని అరెస్టు చేశామని.. మరో 504 మందిని అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. వారినుంచి దేశీయంగా తయారుచేసిన 21 పిస్టల్స్, 20 తూటాలు, 27 కత్తులతో పాటు పెద్దఎత్తున మాదక ద్రవ్యాలు, అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. నిందితుల నుంచి దాదాపు రూ.2 లక్షలు పట్టుకున్నట్లు వివరించారు. ఈ క్రమంలో 310 మొబైల్ ఫోన్లు, 231 ద్విచక్ర వాహనాలను కూడా స్వాధీనం చేసుకున్నామని.. ఇవన్నీ దొంగిలించిన వస్తువులుగా గుర్తించామని పేర్కొన్నారు.



