నవతెలంగాణ-హైదరాబాద్ : పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా భారీ సంఖ్యలో పేర్లను తొలగించేందుకు భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) సిద్ధమైంది. బూత్-స్థాయి అధికారులు (బీఎల్ఓ) సేకరించిన ఫారాల డిజిటైజేషన్ సరళిని బట్టి, సుమారు 43.30 లక్షల పేర్లను ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి మినహాయించనున్నట్లు ఈసీఐ అంచనా వేసింది. ఈ ముసాయిదా జాబితాను ఈ నెల 16న ప్రచురించనున్నారు.
రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయ వర్గాల ప్రకారం సోమవారం సాయంత్రం వరకు జరిగిన డిజిటైజేషన్ ఆధారంగా ఈ అంచనా వేశారు. ప్రక్రియ పూర్తయ్యే నాటికి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అక్టోబర్ 27 నాటికి బెంగాల్లో మొత్తం ఓటర్ల సంఖ్య 7,66,37,529గా ఉంది. తొలగించనున్న 43.30 లక్షల పేర్లలో అత్యధికంగా 21.45 లక్షల మంది మరణించిన ఓటర్లు ఉన్నారు. సుమారు 15.10 లక్షల మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు కాగా, 5.5 లక్షల మంది ఆచూకీ లభించని వారుగా గుర్తించారు. బోగస్ లేదా నకిలీ ఓటర్ల సంఖ్య లక్ష కంటే తక్కువగా ఉన్నట్లు తేలింది.



